Home > ఆంధ్రప్రదేశ్ > నిమజ్జనానికి తమకంటే ముందుగా బయల్దేరారని దళితులపై దాడి

నిమజ్జనానికి తమకంటే ముందుగా బయల్దేరారని దళితులపై దాడి

నిమజ్జనానికి తమకంటే ముందుగా బయల్దేరారని దళితులపై దాడి
X

గణేష్ నిమజ్జనానికి తమకంటే ముందుగా వెళ్లారని కొందరు యువకులు దళితులపై దాడి చేశారు. ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లాలో జరిగిన ఈ ఘటనలో యువకుల వెనుక అధికార పార్టీ నాయకుల ప్రోద్భలం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. సోమందేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని చాకర్లపల్లిలో దళితులు వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. బుధవారం నిమజ్జనం చేయాలని నిర్ణయించుకొని, విగ్రహాన్ని వాహనంలో తరలించారు.

అయితే వీరి వాహనాన్ని ఇతర సామాజికవర్గానికి చెందిన పలువురు యువకులు అడ్డుకొని దుర్భాషలాడారు. దీంతో బాధితులు ఈ విషయంలో అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే స్థానిక ఎస్ఐ తిరుమల బ్రహ్మోత్సవాల బందోబస్తుకు వెళ్లడంతో.. ఆరోజు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మళ్లీ శుక్రవారం రాత్రి పలు సామాజిక వర్గాలకు చెందిన యువకులు, మహిళలు శుక్రవారం రాత్రి దళిత కాలనీల్లో కర్రలు పట్టుకొని తిరిగారు. కులం పేరుతో దూషణలు చేశారు. ఈ సమయంలో వారు పలువురిపై దాడి చేశారు. దీంతో సీఐ, ఎస్ఐలు శనివారం ఆ గ్రామానికి చేరుకొని విచారణ జరిపారు. మొత్తంగా 18 మందిపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇందులో పలువురు అధికార వైసీపీ నాయకులు కూడా ఉన్నారు. కాగా.. గ్రామంలో పికెట్ ఏర్పాటు చేశామని సీఐ కరుణాకర్‌, ఎస్సై విజయ్‌కుమార్‌ వెల్లడించారు.

Updated : 25 Sep 2023 4:08 AM GMT
Tags:    
Next Story
Share it
Top