Home > సినిమా > రాముడిగా ప్రభాస్ను అందుకే ఎంచుకున్నా : ఓం రౌత్

రాముడిగా ప్రభాస్ను అందుకే ఎంచుకున్నా : ఓం రౌత్

రాముడిగా ప్రభాస్ను అందుకే ఎంచుకున్నా : ఓం రౌత్
X

ఆదిపురుష్ సినిమాపై నెగిటివిటీ వస్తున్నా కలెక్షన్లలో మాత్రం దూసుకెళ్తోంది. ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా నటించిన ఈ మూవీని ఓం రౌత్ తెరకెక్కించారు. అయితే ఈ మూవీపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రామాయణాన్ని ఓం రౌత్ సరిగ్గా తీయలేదనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే రాముడిగా ప్రభాస్ ను ఎంపిక చేసుకోవడంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ ను ఒప్పించేందుకు చాలా కష్టపడినట్లు తెలిపారు.

తాను ఆదిపురుష్ సినిమా చేయాలనుకున్నప్పటి నుంచి ప్రభాస్‌ను మాత్రమే రాముడిగా ఊహించుకున్నట్లు ఓం రౌత్ చెప్పారు. ‘‘ఆదిపురుష్‌ కొత్త తరం కోసం తీసిన సినిమా. మొత్తం రామాయణాన్ని తెరపై చూపించడం సాధ్యం కాదు. అందుకే యుద్ధకాండను మాత్రమే ఎంచుకున్నాను. ఇందులో రాముడు పరాక్రమవంతుడిగా కనిపిస్తాడు. ప్రభాస్‌ ఈ పాత్రకు కచ్చితంగా సరిపోతాడని అనుకున్నాను. మన హృదయంలోని భావాలు కళ్లలో కనిపిస్తాయని నా అభిప్రాయం. ప్రభాస్‌ కళ్లలో నీతి, నిజాయతీ కనిపిస్తుంటాయి. అంత పెద్ద స్టార్‌ అయినప్పటికీ చాలా వినయంగా ఉంటాడు. అందుకే సినిమా చేయాలని అనుకున్న రోజే రాముడిగా ప్రభాస్‌ మాత్రమే సరైన ఎంపిక’’ అని భావించినట్లు రౌత్ చెప్పారు.

ఈ పాత్ర కోసం ప్రభాస్ ను ఒప్పించేందుకు చాలా కష్టపడినట్లు రౌత్ తెలిపారు. ‘‘ప్రభాస్‌కు ఈ విషయం చెప్పగానే ఆశ్చర్యపోయాడు. అతడిని ఒప్పించడం అంత ఈజీగా జరగలేదు. ఫోన్‌లో పాత్రకు సంబంధించిన వివరాలు చెప్పడానికి చాలా కష్టపడ్డాను. ఒకసారి తనని కలిసి స్టోరీ గురించి చెప్పా. అప్పుడు వెంటనే ఒకే అన్నాడు. చాలా శ్రద్ధగా ఈ సినిమా చేశాడు. నాకు అన్ని విధాలుగా సపోర్ట్‌గా నిలిచాడు. భవిష్యత్తులోనూ మా స్నేహం ఇలాగే కొనసాగుతుందని ఆశిస్తున్నాను’’ అని ఓం రౌత్‌ స్పష్టం చేశారు.

Updated : 19 Jun 2023 8:23 AM GMT
Tags:    
Next Story
Share it
Top