కర్నూలులో వలంటీర్ కీచకం.. యువతిపై
X
వైజాగ్లో ఓ వలంటీర్ బంగారు నగల కోసం వృద్ధురాలిని దారుణంగా హతమార్చిన ఉదంతాన్ని మరవకముందే మరో వలంటీర్ బరితెగించాడు. ఓ యువతిపై అసభ్య చేష్టంతో వికృతంగా ప్రవర్తించాడు. వలంటీర్ల వ్యవస్థలపై వివాదం నేపథ్యంలో నష్ట నివారణ కోసం కొందరు రాజకీయ నాయకులు విషయం పూర్తిగా బయటికి పొక్కకుండా మేనేజ్ చేసినట్లు తెలుస్తోంది. కర్నూలు జిల్లా కల్లూరు మండలం ఉలింకొండకు చెందిన మధుకృష్ణ అనే వలంటీర్ ఓ అమ్మాయిని వేధించినట్లు తెలుస్తోంది. బైక్పై తన స్నేహితుడితో కలసి వెళ్తూ గ్రామానికి చెందిన ఓ యువతితో అసభ్యకరంగా ప్రవర్తించగా ఆమె గట్టిగా ప్రతిఘటించినట్లు స్థానికులు చెబుతున్నారు. తర్వాత బాధితురాలు తన కుటుంబ సభ్యులతో కలసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
విషయం తెలుసుకున్న రాజకీయ నేతలు రంగంలోకి దిగి ఫిర్యాదుపై చర్యలు తీసుకోకుండా ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. కాగా, ఆదివారం విశాఖపట్నం పెందుర్తితో వెంకట్ అనే వలంటీర్.. వరలక్ష్మి అనే వృద్ధురాలిని దిండుతో ఊపిరాడకుండా అదిమిపట్టి చంపేయడం తెలిసిందే. ఆర్థిక కష్టాల్లో ఉన్న వెంకట్ బంగారం కోసమే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. వలంటీర్ వ్యవస్థను కొందరు వైసీపీ నేతలు స్వార్థానికి వాడుకుంటున్నారని, ఫలితంగా ఏపీ నుంచి వేలమంది అమ్మాయిలు అదృశ్యమయ్యారని జనసేన నేత పవన్ కల్యాణ్ ఆరోపించడం, ఆయన వ్యాఖ్యలపై దుమారం రేగుతుండడం తెలిసింది.