Home > అంతర్జాతీయం > భారీగా పెరిగిన పెట్రోల్ ధర.. కరెంటు ఛార్జీలు 25 శాతం పెంపు.. ఇంతకీ ఎక్కడంటే..

భారీగా పెరిగిన పెట్రోల్ ధర.. కరెంటు ఛార్జీలు 25 శాతం పెంపు.. ఇంతకీ ఎక్కడంటే..

భారీగా పెరిగిన పెట్రోల్ ధర.. కరెంటు ఛార్జీలు 25 శాతం పెంపు.. ఇంతకీ ఎక్కడంటే..
X

క్యూబా ఆర్థిక పరిస్థితి అధ్వానంగా మారింది. ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ద్రవ్యలోటును తగ్గించుకునే క్రమంలో పెట్రోల్‌ ధరలను భారీగా పెంచాలని నిర్ణయించింది. పెట్రోల్ రేటును దాదాపు 500 శాతానికిపైగా పెంచింది. క్యూబా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆ దేశ ప్రజల నెత్తిన పిడుగుపడినట్లైంది.

పెరిగిన పెట్రోల్ ధరలు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం క్యూబాలో లీటర్ పెట్రోల్ ధర 25 క్యూబన్ పెసోలు అంటే మన కరెన్సీలో రూ. 87గా ఉంది. తాజాగా నిర్ణయంతో ఫిబ్రవరి 1 నుంచి లీటర్ పెట్రోల్ రేటు 132 పెసోలకు చేరుకోనుంది. ఇండియన్ కరెన్సీలో దీని విలువ రూ.457. ఇక ప్రీమియం పెట్రోల్ రేటు కూడా 30 పెసోల నుంచి 156 పెసోలకు పెరగనుంది. అంటే లీటర్ ప్రీమియం పెట్రోల్ కోసం రూ. 540 చెల్లించాల్సి ఉంటుంది.

ఇంధన ధరలతో పాటు కరెంటు ఛార్జీలు కూడా పెంచాలని క్యూబా ప్రభుత్వం భావిస్తోంది. ఇళ్లకు సరఫరా చేసే కరెంటు ఛార్జీలను 25శాతం పెంచుతున్నట్లు ఆ దేశ ఆర్థిక మంత్రి రెగ్యురో ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి క్రూడాయిల్ కొనుగోలు చేసేందుకు ఫారిన్ కరెన్సీ నిల్వలు పెంచుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం పెట్రోల్ బంకుల్లో ఇంధనం కొనుగోలుకు కేవలం అమెరికన్ డాలర్లు మాత్రమే తీసుకుంటామని ప్రకటించారు.

కరోనా మహమ్మారి కారణంగా క్యూబా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. దీనికి తోడు అమెరికా ఆంక్షలు కఠినతరం చేయడం పరిస్థితిని మరింత అధ్వానంగా మార్చింది. ఇప్పటికే నిత్యావసరాల ధరలు భారీగా పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో పెరిగిన పెట్రోల్ ధరలు అక్కడి ప్రజలపై మరింత భారం పెంచనున్నాయి.

Updated : 10 Jan 2024 6:33 AM GMT
Tags:    
Next Story
Share it
Top