Home > జాతీయం > Arvind Kejriwal : ఈడీ విచారణకు ఏడోసారీ కేజ్రీవాల్‌ డుమ్మా

Arvind Kejriwal : ఈడీ విచారణకు ఏడోసారీ కేజ్రీవాల్‌ డుమ్మా

Arvind Kejriwal : ఈడీ విచారణకు ఏడోసారీ కేజ్రీవాల్‌ డుమ్మా
X

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఏడోసారి ఈడీ విచారణకు డుమ్మా కొట్టారు. లిక్కర్ స్కాం కేసులో ఇవాళ విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. అయితే విచారణకు హాజరుకావడం లేదని ఈడీకి ఆయన సమాచారమిచ్చారు. ఈ అంశంపై కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో ఈడీ నోటీసులు ఇవ్వడం సరికాదని ఆప్ ఆరోపించింది. ఈడీ పదే పదే సమన్లు జారీ చేసే బదులు కోర్టు నిర్ణయం వచ్చేంతవరకు వేచి చూడాలని తెలిపింది. మార్చి 16న కోర్టులో విచారణ ఉందని.. అప్పటివరకు ఈడీ ఓపిక పట్టాలని ఆప్ స్పష్టం చేసింది.

ఈడీ విచారణకు కేజ్రీవాల్ డుమ్మా కొట్టడం ఇది ఏడోసారి. గతంలో 6సార్లు నోటీసులు జారీ చేయగా.. ఆయన విచారణకు హాజరుకాలేదు. కేజ్రీవాల్ విచారణకు సహకరించడం లేదని ఇప్పటికే ఈడీ కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో ఈ నెల 17న వర్చువల్గా కేజ్రీవాల్ కోర్టు విచారణకు హాజరయ్యారు. న్యాయస్థానం తదుపరి విచారణను మార్చి 16కు వాయిదా వేసింది. ఇక మార్చి 16న కేజ్రీవాల్ స్వయంగా కోర్టుకు హాజరుకానున్నారు. అయితే అప్పటివరకు ఈడీ ఆగాలని ఆప్ చెబుతోంది.

కాగా లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి ఈడీ గతేడాది నవంబర్‌ 2న తొలిసారిగా సీఎం కేజ్రీవాల్‌కు ఈడీనోటీసులు జారీచేసింది. అయితే ఆయన విచారణకు హాజరుకాలేదు. దీంతో ఈడీ అధికారులు డిసెంబర్‌ 21న రెండోసారి నోటీసులు పంపారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ఉందన్న కారణంతో 10 రోజులపాటు విపాసన మెడిటేషన్‌ క్యాంప్‌కు వెళ్లారు. ఈ క్రమంలో జనవరి 3న విచారణకు రావాలంటూ ఆప్‌ అధినేతకు మూడోసారి నోటీసులు పంపించింది. అయితే దానికి కూడా సీఎం కేజ్రీవాల్‌ దూరంగా ఉన్నారు. జనవరి 18న 4వ సారి, జనవరి 31న ఐదోసారి, ఫిబ్రవరి 14న ఆరోసారి నోటీసులు జారీ చేసింది. అయినా కేజ్రీవాల్ విచారణకు హాజరుకాలేదు.


Updated : 26 Feb 2024 5:15 AM GMT
Tags:    
Next Story
Share it
Top