Home > జాతీయం > ఐదు రాష్ట్రాల ఎన్నికలపై బీజేపీ నజర్.. పార్టీ అధ్యక్షుల మార్పు..?

ఐదు రాష్ట్రాల ఎన్నికలపై బీజేపీ నజర్.. పార్టీ అధ్యక్షుల మార్పు..?

ఐదు రాష్ట్రాల ఎన్నికలపై బీజేపీ నజర్.. పార్టీ అధ్యక్షుల మార్పు..?
X

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్గా భావిస్తున్న ఈ ఎన్నికల్లో సత్తా చాటేందుకు బీజేపీ వ్యూహాలకు పదునుపెడుతోంది. ఈ క్రమంలో తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్ఘడ్, రాజస్థాన్, మిజోరం అసెంబ్లీ ఎన్నికలపై పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్టీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ సోమ, మంగళవారాల్లో సుదీర్ఘంగా చర్చించారు. దాదాపు 10గంటల పాటు జరిగిన సమావేశంలో ఆయా రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితి, ఓటు బ్యాంకు పెంచుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు తెలుస్తోంది.

అసెంబ్లీ ఎన్నికలపై చర్చ

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎలక్షన్లపై ప్రభావం చూపనుంది. తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలుండగా, రాజస్థాన్ లో 25, మధ్యప్రదేశ్ లో 29, ఛత్తీస్ ఘడ్ లో 11, మిజోరంలో ఒక ఎంపీ స్థానాలున్నాయి. కేంద్రంలో అధికారం చేపట్టాలంటే ఈ 82 లోక్ సభ స్థానాలు కీలకం కానున్నాయి. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని నేతలు నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా పార్టీ అధ్యక్షులను, ఇంఛార్జులను మార్చాలని నిర్ణయించినట్లు సమాచారం.

తెలంగాణపై ప్రత్యేక దృష్టి

ఇక తెలంగాణ విషయానికొస్తే రాష్ట్రంలో అధికారపార్టీపై వ్యతిరేకత ఉంది. దీన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని నేతలు నిర్ణయించారు. ఇక మరో ప్రధానప్రతిపక్షమైన కాంగ్రెస్ లో ఉన్న వర్గపోరును తమకు అనుకూలంగా మార్చుకునే అంశంపై నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. వీటితో పాటు రాష్ట్రంలో కొత్తగా ఎన్నికల కమిటీ, ప్రచార కమిటీ, మేనిఫెస్టో కమిటీ సహా పలు కమిటీల నియామకానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యవహారం సైతం ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది.

ముగ్గురు నేతల పర్యటన

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న నేతలను ఎలా బుజ్జగించాలన్న దానిపైనా నేతలు చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి. చేరికల కమిటీ కన్వీనర్గా ఉన్న ఈటల రాజేందర్కు ప్రచార కమిటీ బాధ్యతలు సైతం అప్పగించాలని నిర్ణయించినట్లు సమాచారం. బండిపై అసంతృప్తిగా ఉన్న నేతలతో ప్రత్యేకంగా మాట్లాడాలని.. వారికి సైతం కొన్ని బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెలలో ప్రధాని మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా తెలంగాణ పర్యటన నేపథ్యంలో ఆ అంశంపైనా చర్చించినట్లు సమాచారం.

Updated : 7 Jun 2023 3:12 AM GMT
Tags:    
Next Story
Share it
Top