Home > జాతీయం > రెజ్లింగ్కు రిటైర్మెంట్.. బ్రిజ్ భూషణ్ కీలక ప్రకటన

రెజ్లింగ్కు రిటైర్మెంట్.. బ్రిజ్ భూషణ్ కీలక ప్రకటన

రెజ్లింగ్కు రిటైర్మెంట్.. బ్రిజ్ భూషణ్ కీలక ప్రకటన
X

రెజ్లింగ్ ఫెడెరేషన్ ఆఫ్ ఇండియా కొత్త ప్యానెల్ ను కేంద్ర ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డబ్ల్యూఎఫ్ఐ మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్ కీలక ప్రకటన చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం ముగిసిన తర్వాత.. రెజ్లింగ్ వ్యవహారాల నుంచి తాను రిటైర్ అవుతున్నట్లు బ్రిజ్ భూషన్ ప్రకటించారు. కొత్త ఎంపికైన ప్యానెల్ దీన్ని చూసుకుంటుందని చెప్పారు. రానున్న లోక్ సభ ఎన్నికలతో పాటు తనపై ఇంకా చాలా బాధ్యతలు ఉన్నాయన్నారు. తన 12 ఏళ్ల సేవకు.. కాలమే సమాధానం చెప్తుందని అన్నారు. బ్రిజ్ భూషణ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని తీవ్ర ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.

అండర్‌-15, అండర్‌-20 జాతీయ రెజ్లింగ్‌ పోటీలను హడావుడిగా నిర్వహించేందుకు సిద్ధం కావడాన్ని తప్పుపట్టిన కేంద్రం.. కొత్త ప్యానెల్ ను సస్పెండ్ చేసింది. దీనిపై స్పందించిన బ్రిజ్ భూషన్.. యువ రెజ్లర్ల క్రీడాకారులు తమ కెరీర్ లో ఒక ఏడాది కోల్పోకూడదనే ఉద్దేశంతోనే ఈ పోటీలను త్వరగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేయాలని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ను క్రీడామంత్రిత్వశాఖ కోరింది. అథ్లెట్ల ఎంపిక సహా.. డబ్ల్యూఎఫ్ఐ వ్యవహారాల నిర్వహణ, నియంత్రణ బాధ్యతలు ఈ తాత్కాలిక కమిటీ చూస్తుందని ఐవోఏ చీఫ్ కు రాసిన లేఖలో పేర్కొంది.

Updated : 24 Dec 2023 3:09 PM GMT
Tags:    
Next Story
Share it
Top