Home > జాతీయం > గోల్డీ బ్రార్ను ఉగ్రవాదిగా ప్రకటించిన కేంద్రం

గోల్డీ బ్రార్ను ఉగ్రవాదిగా ప్రకటించిన కేంద్రం

గోల్డీ బ్రార్ను ఉగ్రవాదిగా ప్రకటించిన కేంద్రం
X

కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కెనడాలో ఆశ్రయం పొందుతున్న గ్యాంగ్‌స్టర్‌ సతీందర్‌ సింగ్‌ అలియాస్‌ గోల్డీ బ్రార్‌ను ఉగ్రవాదిగా ప్రకటించింది. ఈ మేరకు అతడిని మోస్ట్‌ వాంటెడ్‌ జాబితాలో చేరుస్తూ కేంద్ర హోం శాఖ ప్రకటన విడుదల చేసింది. గోల్డీ బ్రార్‌కు నిషేధిత ఖలిస్థానీ ఉగ్రవాద సంస్థ బబ్బర్‌ ఖల్సా ఇంటర్నేషనల్‌తో సంబంధాలు ఉన్నాయని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA), 1967 ప్రకారం గోల్డీ బ్రార్‌ను ఉగ్రవాదిగా ప్రకటిస్తున్నట్లు హోం శాఖ చెప్పింది.

గోల్డీ బ్రార్‌కు విదేశీ ఉగ్రవాద సంస్థలతో పాటు పలు హత్యలతో సంబంధం ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. ఇతను అతివాద భావజాలాన్ని వ్యాపింప చేయడంతో పాటు, పలువురు జాతీయవాద అనుకూల నాయకులకు బెదిరింపు ఫోన్‌ కాల్స్‌ చేసినట్లు ఆరోపించింది. దేశంలోని పలువురు ప్రముఖులను హత్య చేసేందుకు కొన్ని హంతక ముఠాలకు డ్రోన్ల ద్వారా అక్రమంగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను రవాణా చేసినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. తన అనుచరులతో పంజాబ్‌ రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగించాలని గోల్డీ బ్రార్‌ ప్రయత్నిస్తున్నట్లు కేంద్రం భావిస్తోంది. అతడిపై ఇంటర్‌పోల్‌ రెడ్‌ కార్నర్‌ నోటీసులు జారీ చేసినట్లు కేంద్రం ప్రకటించింది.

1994లో పంజాబ్‌లోని శ్రీ ముక్త్సార్‌ సాహిబ్‌లో సతీందర్‌ సింగ్‌ అలియాస్‌ గోల్డీ బ్రార్‌ జన్మించాడు. అతని తండ్రి పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌. సిద్ధూ మూసేవాలా హత్య కేసు దర్యాప్తు సమయంలో తొలిసారి గోల్డీ పేరు వెలుగులోకి వచ్చింది. మూసేవాలా హత్య కేసులో అరెస్టైన లారెన్స్‌ బిష్ణోయ్‌తో గోల్డీ బ్రార్ కు సన్నిహిత సంబంధాలున్నాయని, మర్డర్ గురించి అతనికి ముందే తెలుసని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. పలు హత్య కేసులతో పాటు బెదిరింపు కాల్స్‌ చేసి డబ్బులు డిమాండ్ చేసినట్లు అతనిపై కేసులు ఉన్నాయి.

Updated : 1 Jan 2024 2:13 PM GMT
Tags:    
Next Story
Share it
Top