Home > జాతీయం > బియ్యం బదులు డబ్బులు.. చేతులెత్తేసిన కాంగ్రెస్ ప్రభుత్వం

బియ్యం బదులు డబ్బులు.. చేతులెత్తేసిన కాంగ్రెస్ ప్రభుత్వం

బియ్యం బదులు డబ్బులు.. చేతులెత్తేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
X

గొప్పలకు పోయి ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక కర్ణాటక ప్రభుత్వం ఇబ్బందులు పడుతోంది. అధికారం చేపట్టిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతి నెలా పేదలకు ఉచితంగా ఇస్తామన్న 5 కిలోల బియ్యం అందించలేక చేతులెత్తేసింది. దీంతో ‘అన్న భాగ్య’ పథకం కింద అదనంగా ఇచ్చే 5 కిలోల బియ్యానికి బదులు కిలోకు రూ.34 చొప్పున నగదు లబ్ధిదారుల ఖాతాలో జమ చెయ్యాలని సిద్ధరామయ్య ప్రభుత్వం నిర్ణయించింది.

తొలి సమావేశంలోనే..

కాగా కేంద్రం ఉచితంగా ఇచ్చే ఐదు కిలోల బియ్యంతో పాటు అదనంగా కుటుంబంలో ఒక్కొక్కరికీ నెలకు మరో 5 కిలోల బియ్యం ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. జులై 1 నుంచి ఈ అన్నభాగ్య పథకాన్ని ప్రారంభించాల్సి ఉంది. ఐతే అనుకున్న సమయానికి బియ్యం సరఫరా కానందున బియ్యానికి బదులు నగదు పంపిణీ చేస్తామని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. జులై 1వ తేదీన కిలోకు రూ. 34 చొప్పున డబ్బును బీపీఎల్‌ రేషన్ కార్డ్ హోల్డర్‌ల ఖాతాలో నేరుగా జమచేయనున్నారు. దీని ప్రకారం ఒక కార్డులో ఒకరు ఉంటే అన్న భాగ్య పథకం కింద ఐదు కిలోల అదనపు బియ్యానికి బదులు నెలకు రూ.170 ప్రభుత్వం జమ చేస్తుంది. ఇద్దరు వ్యక్తులకు రూ.340, ఐదుగురు వ్యక్తులకు రూ.850ల చొప్పున జమకానున్నాయి. బియ్యం అందే వరకు 5 కిలోలకు డబ్బులు ఇస్తామని, ఇందుకు ప్రతినెలా రూ.700 కోట్లు ఖర్చు అవుతుందని వెల్లడించింది. కర్ణాటకలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత బుధవారం జరిగిన తొలి కేబినెట్ సమావేశంలోనే ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

మేమేం ఇస్తామనలేదే...

అన్న భాగ్య పథకం అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం బియ్యం ఇచ్చేందుకు నిరాకరిస్తోందంటూ కాంగ్రెస్‌ తీవ్ర ఆరోపణలు చేస్తుండగా.. బియ్యం ఇస్తామని తాము ఎలాంటి హామీ ఇవ్వలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే తెలంగాణ నుంచి బియ్యాన్ని సేకరించాలని సిద్ధరామయ్య ప్రభుత్వం కేసీఆర్ సర్కార్‌ను కోరింది. దీంతో ఎన్నికల హామీలను అమలు చేయడంలో సిద్ధూ సర్కారు విఫలమైందంటూ బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే కర్ణాటక ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

Updated : 29 Jun 2023 4:45 AM GMT
Tags:    
Next Story
Share it
Top