Home > జాతీయం > గుళ్లల్లో 'పూజారమ్మ'లు.. జెండర్ ఇక్వాలిటీకి ఇదే ప్రూఫ్: సీఎం

గుళ్లల్లో 'పూజారమ్మ'లు.. జెండర్ ఇక్వాలిటీకి ఇదే ప్రూఫ్: సీఎం

గుళ్లల్లో పూజారమ్మలు.. జెండర్ ఇక్వాలిటీకి ఇదే ప్రూఫ్: సీఎం
X

సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఓ వర్గాన్ని కించపరిచేలా ఈ వ్యాఖ్యలు చేశారంటూ కొందరు ఈ వివాదంపై సుప్రీంకోర్టుకు వెళ్లారు కూడా. ఆ రాష్ట్రంలోని ప్రతిపక్షాలు.. మంత్రి చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ.. ఈ విషయాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్న తరుణంలో తమిళనాడు ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ముగ్గురు మహిళలకు అర్చకత్వ పాఠాలు నేర్పి వాళ్లనే ఓ గుడిలో పూజారులుగా నియమించింది. అర్చక ట్రైనింగ్‌ స్కూల్‌లో వాళ్లకు శిక్షణ అందించింది ప్రభుత్వం. రమ్య, కృష్ణవేణి, రంజిత అనే ముగ్గురు మహిళలు ఒక సంవత్సరం కోర్సులోని థియరీని విజయవంతంగా పూర్తి చేసి ప్రభుత్వ హిందూ ధార్మిక మంత్రిత్వ శాఖ నుంచి తాజాగా సర్టిఫికెట్‌లు పొందారు. ప్రాక్టికల్స్‌లో భాగంగా ఒక సంవత్సరం పాటు వివిధ ఆలయాల్లో సహాయక అర్చకులుగా పని చేసి తదుపరి అర్చకులుగా నియమితులవుతారు. కోర్సు చదివిన కాలంలో వీరికి 3000 రూపాయల స్టయిపెండ్‌ లభించింది.

తమిళనాడు ప్రభుత్వం వారికి సర్టిఫికేట్ అందించింది. లింగ సమానత్వానికి ఇదే నిదర్శనమని తేల్చి చెప్పారు స్టాలిన్. అసలు సిసలు సనాతన ధర్మం అంటే ఇదే అని పరోక్షంగా బీజేపీకి చురకలు అంటించారు. మహిళలు అన్ని రంగాల్లో విజయం సాధిస్తున్నారని,అంతరిక్షంలోకీ వెళ్తున్నారని అయినా గుడిలో మాత్రం వాళ్లకి అర్చకత్వం చేసే అవకాశం కల్పించకపోవడం దారుణమని అన్నారు. మహిళలు అర్చకత్వం చేస్తే ఆలయం అపవిత్రమైపోతుందని ప్రచారం చేశారు. కానీ మేం ఆ అభిప్రాయాల్ని మార్చేశాం. మార్పు తీసుకొచ్చాం. ఇకపై మహిళలు కూడా ఆలయాల్లో మంత్రాలు చదువుతారు. అర్చకత్వం చేస్తారు. ద్రవిడయన్ మోడల్‌లో భాగంగా ఇప్పటికే అన్ని కులాల వారిని ఆలయాల్లో పూజారులుగా నియమించాం. ఇప్పుడు ఆ అవకాశాన్ని మహిళలకీ అందించామని సీఎం స్టాలిన్ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.




Updated : 16 Sep 2023 3:34 AM GMT
Tags:    
Next Story
Share it
Top