Home > జాతీయం > ఇండియన్ పీనల్ కోడ్‌పై కేంద్రం సంచలన నిర్ణయం.. ఇక అన్నీ దేశీయమే..

ఇండియన్ పీనల్ కోడ్‌పై కేంద్రం సంచలన నిర్ణయం.. ఇక అన్నీ దేశీయమే..

ఇండియన్ పీనల్ కోడ్‌పై కేంద్రం సంచలన నిర్ణయం.. ఇక అన్నీ దేశీయమే..
X

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. తరతరాల నాటి కీలక శిక్షాస్మృతులను కాలగర్భంలో కలపనుంది. ఐపీసీ, సీఆర్సీసీ, ఎవిడెన్స్ చట్టాల స్థానంలో కొత్త చట్టాలను తీసుకురానుంది. బ్రిటిష్ కాలం నాటి ఈ చట్టాలకు కాలం చెల్లిందని, బాధితులకు న్యాయం చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని హోం మంత్రి అమిత్ షా చెప్పారు. ఆయన శుక్రవారం పార్లమెంటులో ఈ చట్టాల రద్దు, కొత్త చట్టాల వివరాలు వెల్లడించాడు. కొత్త చట్టాలకు సంబంధించిన బిల్లులను కూడా ప్రవేశపెట్టారు. ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో భారతీయ న్యాయ సంహిత- 2023(Bharatiya Nyaya Sanhita), క్రిమినల్ ప్రొసీడింగ్స్ కోడ్ స్థానంలో భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత- 2023( Bharatiya Nagarik Suraksha Sanhita), ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ సాక్ష్య బిల్లు- 2023(Bharatiya Sakshya) లను పరిశీలన కోసం పార్లమెంటరీ స్థాయీ సంఘానికి పంపిస్తామని ఆయన వెల్లడించారు.

ఎందుకు?

బ్రిటిష్ కాలం నాటి ఐపీసీ (Indian Penal Code), సీఆర్‌పీసీ (Code of Criminal Procedure), ఎవిడెన్స్‌ యాక్ట్ (Indian Evidence Act)లు శిక్షించడానికే తప్ప బాధితులకు సంపూర్ణ న్యాయం చేయడానికి ఉద్దేశించినవి కావని కేంద్రం అభిప్రాయం పడుతోంది. దేశీయ పరిస్థితులకు తగ్గట్టు కొత్త చట్టాలు ఉంటాయని అమిత్ షా చెప్పారు. ‘‘ఐపీసీ వంటి చట్టాలు ఆంగ్లేయుల ప్రయోజనాల కోసమే తెచ్చారు. మేం తెస్తున్న చట్టాలు మన ప్రజల హక్కులను కాపాడతాయి. శిక్ష వేయడమ కాకుండా న్యాయం అందిస్తూ నేరాలను అరికడతాయి. మహిళలపై, బాలలపై నేరాలకు నియంత్రించడమే కాకుండా దేశ వ్యతిరేక చర్యలను అడ్డుకుంటాయి’’ అని ఆయన తెలిపారు. బ్రిటిష్ ప్రభుత్వం 1860లో ఐపీసీ, క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌, ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌లను తీసుకొచ్చింది. వీటిలో కొన్ని నిబంధనలు ప్రస్తుత అవసరాలు తీర్చేవిగా లేవు. చాలా లొసుగులు ఉండడంతో నిందితులు తప్పించుకుంటున్నారనే అరోపణలు ఉన్నాయి.

కొత్త చట్టాల్లో..

రాజద్రోహ చట్టాన్ని తప్పించి కఠిన శిక్షలను ప్రతిపాదించారు. సాయుధ తిరుగుబాటు, విధ్వంసం, దేశాన్ని చీల్చే వేర్పాటువాదాలను ప్రోత్సహిస్తూ దేశానికి ద్రోహం చేస్తే జీవిత ఖైదు లేదా ఏడేళ్ల జైలు శిక్ష, జరిమానా పడుతుంది. ఏడేళ్లకు పైగా శిక్షపడే కేసుల్లో ఫోరెన్సిక్‌ తనిఖీ తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. సీఆర్సీసీలో 300 మార్పులు చేశారు. ఎఫ్ఐఆర్‌ను ఎక్కడి నుంచైనా ఫైల్ చేసే వెసలుబాటుతో పాటు పలు సౌలభ్యాలు కల్పించారు. మూక హత్యలకు పాల్పడితే మరణశిక్ష విధిస్తారు. సామూహిక అత్యాచారాలకు 20 ఏళ్లు లేదా జీవితఖైదు, మైనర్‌లపై అత్యాచారాలకు పాల్పడితే మరణశిక్ష పడుతుంది.


Updated : 12 Aug 2023 2:19 AM GMT
Tags:    
Next Story
Share it
Top