Devendra Pratap Singh Tomar : మరో 10 రోజుల్లో ఎన్నికలు.. రూ.100 కోట్లు పంచాలంటున్న కేంద్రమంత్రి కొడుకు!!
X
మరో పది రోజుల్లో మధ్యప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న క్రమంలో... బీజేపీ నేత, కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కుమారుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం రాజకీయ వర్గాల్లో దుమారం రేపింది. మంత్రి కుమారుడు దేవేంద్ర ప్రతాప్ సింగ్ తోమర్.. కోట్లాది రూపాయల డబ్బు గురించి మాట్లాడటం అందులో కన్పించింది. ఆ వీడియోలో ప్రతాప్ సింగ్ తోమర్ ఓ వ్యక్తితో రూ.వంద కోట్లను తరలించే విషయంపై చర్చిస్తున్నట్లుగా ఉంది. మరో కాల్ రికార్డులో ఆయనకు అందాల్సిన రూ.18 కోట్లను వేర్వేరు బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేసినట్లు ఓ వ్యక్తి మాట్లాడాడు. ఈ ఆడియో, వీడియోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఈ వీడియోపై న్యాయ విచారణ చేపట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. దర్యాప్తులో నిజాలు నిగ్గు తేలే వరకు కేంద్ర మంత్రి నరేంద్రసింగ్ తోమర్ను పదవి నుంచి తొలగించాలని కోరింది
కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనాతే.. దీనిపై వెంటనే విచారణ జరిపి సంబంధిత వ్యక్తులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నరేంద్రసింగ్ తోమర్ ఢిల్లీలోనే కాదు.. మధ్యప్రదేశ్లోనూ చాలా శక్తిమంతమైన వ్యక్తి అని.. అతడి కుమారుడిని అరెస్టు చేసేంత వరకు దర్యాప్తు నిష్పక్షపాతంగా సాగదని అన్నారు. దేవేందర్ సింగ్ తోమర్ లంచం డిమాండ్ చేయడం, కోట్లాది రూపాయల లావాదేవీల గురించి మాట్లాడటం స్పష్టంగా కనబడుతున్నదని, దీనిని ఈసీ తీవ్రమైన అంశంగా పరిగణించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ అంశంపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎందుకు మౌనంగా ఉన్నాయని ప్రశ్నించారు.
మరోవైపు ఈ వీడియో ఫేక్ అని అంటున్నారు దేవేంద్ర ప్రతాప్ సింగ్ తోమర్ అంటున్నారు. అవి నకిలీవి అని, తన ప్రతిష్ఠకు భంగం కలిగించేందుకు కొందరు కుట్రపన్ని వాటిని సృష్టించారని ఆరోపించారు. వాటి వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దేవేంద్ర ప్రతాప్ సింగ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశామని, విచారణ చేపడుతున్నామని పోలీసులు తెలిపారు.