Home > జాతీయం > ముగిసిన విపక్షాల తొలిరోజు భేటీ.. రేపు మరోసారి మీటింగ్..

ముగిసిన విపక్షాల తొలిరోజు భేటీ.. రేపు మరోసారి మీటింగ్..

ముగిసిన విపక్షాల తొలిరోజు భేటీ.. రేపు మరోసారి మీటింగ్..
X

బెంగళూరులో విపక్ష నేతల భేటీ ముగిసింది. దాదాపు 2 గంటల పాటు వివిధ అంశాలపై చర్చించిన నేతలు మంగళవారం మరోసారి సమావేశం కావాలని నిర్ణయించింది. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడంతో పాటు పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. మహారాష్ట్రలో ఎన్సీపీ తిరుగుబాటు, బెంగాల్ పంచాయితీ ఎన్నికల్లో హింసకు టీఎంసీనే కారణమని కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల ఆరోపణల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

బెంగళూరులో జరిగిన భేటీలో పలువురు అగ్ర నేతలు హాజరయ్యారు. కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీతో పాటు తృణమూల్‌ చీఫ్, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్‌ , బీహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్‌, బీహార్‌ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌, ఢిల్లీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌ , మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే ఆయన కుమారుడు ఆదిత్య ఠాక్రే, జార్ఖండ్‌ సీఎం హేమంత్‌సోరెన్‌, పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, డీఎండీకే ప్రధాన కార్యదర్శి వైకోతో పాటు మొత్తం 26 పార్టీలకు చెందిన ముఖ్య నేతలు మీటింగ్ కు అటెండయ్యారు.

ఇదిలా ఉంటే విపక్షాల తొలి రోజు సమావేశానికి ఎన్సీపీ చీఫ్ శరద్‌ పవార్‌ డుమ్మా కొట్టారు. దీంతో ఆయన గైర్హాజరుపై రకరకాల ఊహాగానాలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఎన్సీపీ క్లారిటీ ఇచ్చింది. మంగళవారం తన కుమార్తె సుప్రియా సూలేతో కలిసి పవార్‌ సమావేశమవుతారని ప్రకటించింది. మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసేందుకు ఆయన ముంబైలోనే ఉండిపోయినట్లు సమాచారం.

Updated : 17 July 2023 5:11 PM GMT
Tags:    
Next Story
Share it
Top