Home > జాతీయం > వర్షాల కారణంగా విరిగిపడ్డ కొండచరియలు.. ఐదుగురు మృతి

వర్షాల కారణంగా విరిగిపడ్డ కొండచరియలు.. ఐదుగురు మృతి

శిథిలాల్లో 30 కుటుంబాలు

వర్షాల కారణంగా విరిగిపడ్డ కొండచరియలు.. ఐదుగురు మృతి
X


గత రెండు రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా మహారాష్ట్రలో కొండ చరియలు విరిగిపడి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. రాయగ‌ఢ్ జిల్లా ఖలాపూర్‌ సమీపంలో.. సరైన రోడ్డు సౌకర్యం కూడా లేని ఇర్షాల్‌వాడీ గ్రామంలో ఈ ఘోరం జరిగింది. బుధవారం రాత్రి కొండచరియలు విరిగిపడి గ్రామంలోని 30 కుటుంబాలకుపైగా శిథిలాల్లో చిక్కుకున్నాయి. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల నుంచి 25 మంది ఇప్పటి వరకూ బయటకు తీయగా.. వీరిలో ఐదుగురు మృతిచెందారు. మిగతా 21 మందిని చికిత్స కోసం ఆస్పత్రుల్లో చేర్చించారు. ఆ ప్రాంతంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రాత్రివేళలో ఘటన జరగడంతో రెస్క్యూ ఆపరేషన్‌కు ఆటంకం ఏర్పడింది.




గాయపడిన వారిని నవీ ముంబయిలోని ఓ ఆస్పత్రికి తరలించినట్లు మంత్రి ఉదయ్ సమంత్ తెలిపారు. సహాయక చర్యల్లో పాల్గొనాలని ట్రెక్కర్ల బృందాలను జిల్లా యంత్రాంగం కోరింది. ఘటనాస్థలాన్ని ముఖ్యమంత్రి ఏక్​నాథ్​ శిందే సందర్శించారు. ఈ ఘటనపై సీఎం ఏక్‌నాథ్ శిందేతో మాట్లాడానని.. 4 ఎన్డీఆర్​ఎఫ్​ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని స్థానిక యంత్రాంగంతో కలిసి సహాయక చర్యలు చేపడుతున్నాయని కేంద్ర హోం మంత్రి అమిత్​ షా ట్వీట్ చేశారు. ప్రజలను రక్షించడం, క్షతగాత్రులకు తక్షణ వైద్య సహాయం అందించడమే తమ పని అని ఆయన తెలిపారు. ఇర్షాల్‌వాడి గ్రామం.. మాథెరన్, పన్వెల్​ మధ్య ఉన్న ఇర్షాల్​గఢ్​ కోట సమీపంలో ఉంది. ఇది ఒక గిరిజన గ్రామం. సరైన రోడ్డు సౌకర్యం కూడా లేదు. ఇర్షాల్​ వాడి గ్రామస్థులకు ఏదైనా అవసరమైతే ముంబయి-పుణె రహదారిపై ఉన్న చౌక్​ టౌన్​కు వెళ్తారు.


Updated : 20 July 2023 5:20 AM GMT
Tags:    
Next Story
Share it
Top