Home > జాతీయం > రామమందిర ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు

రామమందిర ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు

రామమందిర ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు
X

అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. వచ్చే ఏడాది జనవరి మూడోవారంలో ప్రారంభోత్సవం జరగనుందని రామమందిరం ట్రస్టు సభ్యులు ప్రకటించారు. ప్రధాని నరేంద్రమోదీని ఈ వేడుకకు ఆహ్వానించనున్నట్లు చెప్పారు. ప్రారంభోత్సవం సందర్భంగా జనవరి 21 నుంచి 23 వరకు కార్యక్రమాలు జరగనున్నాయి. ఆలయ ప్రారంభోత్సవంలోని ప్రధాన ఘట్టాన్ని రాజకీయాలకు అతీతంగా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ఎలాంటి వేదిక, బహిరంగ సభ ఉండదని స్పష్టం చేశారు.

రామ మందిర ప్రారంభోత్సవ వేడుకకు 136 సనాతన సంప్రదాయాలకు చెందిన 25వేల మంది హిందూ మత పెద్దలను ఆహ్వానించనున్నట్లు ట్రస్టు కార్యదర్శి చంపత్‌ రాయ్‌ చెప్పారు. ఆ జాబితా సిద్ధమైన తరువాత ట్రస్టు అధ్యక్షుడు మహంత్‌ నిత్య గోపాల్‌ దాస్‌ సంతకంతో వారికి ఆహ్వాన పత్రాలు పంపించనున్నారు. కార్యక్రమానికి హాజరయ్యే సాధువులకు మఠాల్లో ఆతిథ్యం ఇస్తామని చెప్పారు. 10వేల మంది సాధువులు ఆలయ పరిసరాల లోపల నిర్వహించే పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారని రాయ్‌ వివరించారు.

2020 ఆగస్టు 5న రామమందిర నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. కొవిడ్‌ కారణంగా అప్పట్లో పరిమిత సంఖ్యలో అతిథులు హాజరయ్యారు. అప్పటి నుంచి ఆలయంలోని రామ్‌లల్లా గర్భగుడి నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది జనవరిలో ఘనంగా ప్రాణ ప్రతిష్ఠకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకను తిలకించేందుకు లక్షలాది భక్తులు తరలివస్తారని ట్రస్టు భావిస్తోంది. అందుకే రోజుకు 75,000 నుంచి లక్ష మందికి భోజనాలు ఏర్పాటు చేయనున్నారు.




Updated : 4 Aug 2023 4:41 PM GMT
Tags:    
Next Story
Share it
Top