Home > జాతీయం > రేపు సోనియా గాంధీ నామినేషన్.. ఎక్కడి నుంచంటే..?

రేపు సోనియా గాంధీ నామినేషన్.. ఎక్కడి నుంచంటే..?

రేపు సోనియా గాంధీ నామినేషన్.. ఎక్కడి నుంచంటే..?
X

కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రాజ్యసభ బరిలో నిలిచేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల సమయంలోనే ఇవే తన చివరి ప్రత్యక్ష ఎన్నికలు సోనియా చెప్పారు. ఈ క్రమంలో ఈ సారి జరిగే లోక్ సభ ఎన్నికలకు దూరంగా ఉండాలని ఆమె నిశ్చయించుకున్నట్లు సమాచారం. దీంతో రాజస్థాన్ నుంచి ఆమె రాజ్యసభకు వెళ్లే అవకాశం ఉంది. బుధవారం ఆమె నామినేషన్ వేయనున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ, ఖర్గే పాల్గొంటారని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

ఇదిలా ఉంటే సోనియా గాంధీ ప్రాతినిథ్యం వహిస్తున్న రాయ్బరేలీ నుంచి ఈ సారి ప్రియాంక గాంధీని బరిలోకి దిగుతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ వార్తలు నిజమైతే ప్రియాంకకు ఇవే తొలి ఎన్నికలు కానున్నాయి. దశాబ్దాలుగా సోనియా రాయ్ బరేలీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాభవం మూటగట్టుకుంది. రాహుల్ గాంధీ సైతం పలు దఫాలుగా పోటీ చేసిన యూపీలోని అమేథీ నియోజకవర్గం నుంచి ఓటమి పాలయ్యారు. అయితే సోనియా మాత్రం తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు.

సోనియాను రాజస్థాన్ నుంచి రాజ్యసభకు పంపుతారన్న ఊహాగానాల నేపథ్యంలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ప్రస్తుతం రాజస్థాన్ నుంచి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఆయన పదవీకాలం ఏప్రిల్ 3తో ముగియనుంది. వయసు, ఆరోగ్య కారణాల దృష్ట్యా ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడంగానీ, పెద్దల సభకు వెళ్లడం గానీ జరిగే అవకాశంలేదు. ఈ క్రమంలో ఆ స్థానం నుంచి సోనియాగాంధీని రాజ్యసభకు పంపాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించినట్లు సమాచారం.

Updated : 13 Feb 2024 2:41 PM GMT
Tags:    
Next Story
Share it
Top