Home > జాతీయం > చీతాల మృతిపై కేంద్రంపై సుప్రీం ఆగ్రహం..

చీతాల మృతిపై కేంద్రంపై సుప్రీం ఆగ్రహం..

చీతాల మృతిపై కేంద్రంపై సుప్రీం ఆగ్రహం..
X

మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో చీతాల వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒకదాని వెంట ఒకటి చీతాలు మరణిస్తుండటంపై సుప్రీంకోర్టు సైతం ఆందోళన వ్యక్తం చేసింది. మరణాలను అరికట్టేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది. దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం ట్రాన్స్ లోకేషన్‌లో 50 శాతం మరణాలు సాధారణమేనని సుప్రీంకోర్టుకు తెలిపింది.

చీతాల మృతికి సంబంధించి దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. గతవారం రెండు చీతాలు చనిపోవడాన్ని ప్రస్తావించిన సుప్రీం.. దీనిని ఎందుకింత ప్రెస్టీజ్ ఇష్యూలా మారుస్తున్నారని కేంద్రాన్ని ప్రశ్నించింది. చీతాలను ఒకే చోట ఎందుకు పెట్టారని ప్రశ్నించింది.

కేంద్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి చీతాలను రక్షించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నామని కోర్టుకు విన్నవించారు. ట్రాన్స్ లోకేషన్‌లో 50 శాతం మరణాలు సాధారణమేనని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఇక్కడి వాతావరణానికి అలవాటుపడతాయా, కిడ్నీ, శ్వాస కోశ సమస్యలేమైనా ఎదుర్కొంటున్నాయా అన్న అంశాలను తెలుసుకోవాలని కోర్టు ఆదేశించింది. దీనిపై స్పందించిన అడిషనల్ సొలిసిటర్ ఇన్ఫెక్షన్ల కారణంగా చీతాలు మృత్యువాత పడుతున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా న్యాయస్థానం చిరుతపులులకు ప్రసిద్ధి చెందిన రాజస్థాన్ లోని అభయారణ్యాన్ని గుర్తు చేసింది. కేంద్రం ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని సూచించింది.

ఫిబ్రవరి 18న కేంద్రం దక్షిణాఫ్రికా నుంచి 12 చీతాలను మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌కు తరలించింది. దేశంలో చీతాల సంతతిని పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. దీనికి సంబంధించి దక్షిణాఫ్రికాతో ఒప్పందం కుదుర్చుకుంది. గతేడాది సెప్టెంబర్ 17న తన పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ నమీబియా నుంచి తీసుకొచ్చిన 8 చీతాలను కునో నేషనల్ పార్క్‌లోకి విడుదల చేశారు.

Updated : 20 July 2023 11:32 AM GMT
Tags:    
Next Story
Share it
Top