Home > జాతీయం > పెళ్లి పీటలపై నుంచి వధువును లాక్కెళ్లిన పోలీసులు...వీడియో వైరల్

పెళ్లి పీటలపై నుంచి వధువును లాక్కెళ్లిన పోలీసులు...వీడియో వైరల్

పెళ్లి పీటలపై నుంచి వధువును లాక్కెళ్లిన పోలీసులు...వీడియో వైరల్
X

కాసేపట్లో పెళ్లి..వరుడు, వధువు ముస్తాబై పెళ్లి పీటలపై కూర్చున్నారు. మూడు నిమిషాలు ఆగితే మూడు ముళ్లు పడేవి. ఇంతలో ఆ జంటకు ఊహించని పరిణామం ఎదురైంది. సినిమాల్లో పెళ్లి సీన్లలో మాదిరిగానే..ముహర్తం సమయానికి ‘ఆపండి’ అంటూ పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. పెళ్లిపీటలపై నుంచి వధువుని బలవంతంగా లాక్కెళ్లారు. వరుడు, బంధువులు అడ్డుకున్నా వినకుండా పోలీసులు ఆమెను కారు ఎక్కించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు వధువును పోలీసులు ఎందుకు లాక్కెళ్లారనేది..ఇప్పుడు తెలుసుకుందాం.

కేరళ‎లోని కోవలం ప్రాంతానికి చెందిన అల్ఫియా, అఖిల్‌‌లు ప్రేమించుకున్నారు. ఇద్దరి కులాలు వేరు కావడంతో పెద్దల నుంచి ఇబ్బందులు ఎదురయ్యాయి. పెళ్లి చేసుకునేందుకు ఇరు కుటుంబాలు అంగీకరించలేదు . దీంతో ఇద్దరు ఇంటి నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం స్థానిక ఆలయంలో పెళ్లికి సిద్ధమయ్యారు. కొద్ది మంది బంధుమిత్రులను పిలిచి వివాహానికి ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే సరిగ్గా తాళి కట్టే సమయానికి పోలీసులు ఆలయానికి వెళ్లి..వధువు ఆల్పియాను బలవంతంగా పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. ఈ వీడియో వైరల్ కావడంతో కేరళ పోలీసులు తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

అయితే తమ డ్యూటీ చేశామంటున్నారు పోలీసులు. అల్ఫియా కన్పించకుండా పోయినట్లు తమకు ఫిర్యాదు అందిందని..కోర్టు ఆదేశాల మేరకు ఆమెను న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టామని చెప్పారు.చివరికి వధువు తన ఇష్టప్రకారమే పెళ్లి జరుగుతుందని కోర్టులో చెప్పడంతో... ఆమె అఖిల్‌తోనే వెళ్లేందుకు న్యాయస్థానం అంగీకరించింది. ఆ తర్వాత వారిద్దరూ కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయారు . పోలీసులు ఎంట్రీతో ఆగిపోయిన పెళ్లి మళ్లీ మంగళవారం జరగనుంది.






Updated : 19 Jun 2023 10:18 AM GMT
Tags:    
Next Story
Share it
Top