Home > జాతీయం > నవజాత శిశువుల మృతి.. డాక్టర్ నిద్రే కారణం

నవజాత శిశువుల మృతి.. డాక్టర్ నిద్రే కారణం

నవజాత శిశువుల మృతి.. డాక్టర్ నిద్రే కారణం
X

ఓ వైద్యుడి నిర్లక్ష్యం... ఇద్దరు నవజాత శిశువుల ప్రాణాలను బలి తీసుకుంది. రాత్రివేళ నిద్రపోవడానికి ​ ఏసీ వేసుకున్న డాక్టర్.. అదే రూమ్ లో ఉన్న ఇద్దరు నవజాత శిశువులు ఉన్నారన్న విషయాన్ని మరిచాడు. రాత్రంతా హాయిగా నిద్రపోయిన ఆ డాక్టర్.. తెల్లారి లేచిన తర్వాత కానీ అతను చేసిన తప్పేంటో గుర్తించలేదు. ఏసీ రూమ్‌లో చలికి తట్టుకోలేక ఆ ఇద్దరు శిశువులు మరణించారు. ఈ దారుణ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని శామలి జిల్లాలో ఆదివారం జరిగింది. మృతుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు డాక్టర్​ నీతుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనపై ఐపీసీ 304 సెక్షన్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

మరోవైపు ఈ ఘటనపై స్పందించిన వైద్యారోగ్య శాఖ.. విచారణకు ఆదేశించింది. దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీఎమ్​ఓ డాక్టర్ అశ్వణి శర్మ తెలిపారు. కైరాణా ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం ఇద్దరు పిల్లలు జన్మించారు. ఆ తర్వాత వారిని మెరుగైన చికిత్స కోసం సమీపంలోని ఓ ప్రైవేట్ క్లినిక్​కు తరలించారు. వీరిద్దరిని ఫొటోథెరపీ యూనిట్​లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే, ఇద్దరు చిన్నారులను పట్టించుకోని డాక్టర్​ నీతు.. హాయిగా నిద్రపోవడానికి రాత్రంతా ఏసీని వేసుకున్నారు. ఆదివారం ఉదయాన్నే చిన్నారులను చూసేందుకు కుటుంబసభ్యులు వెళ్లేసరికి.. చనిపోయి కనిపించారు. దీంతో ఆగ్రహించిన కుటుంబసభ్యులు.. ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. డాక్టర్ నీతుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Updated : 26 Sep 2023 2:31 AM GMT
Tags:    
Next Story
Share it
Top