Home > జాతీయం > నేడు ఢిల్లీలో వైఎస్ షర్మిల దీక్ష

నేడు ఢిల్లీలో వైఎస్ షర్మిల దీక్ష

నేడు ఢిల్లీలో వైఎస్ షర్మిల దీక్ష
X

కేంద్ర మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత పలు రాష్ట్రాలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. లోక్‌సభ చివరి సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే వ్యూహాతో పలువురు ముందుకు వెళ్లనున్నారు. ముఖ్యంగా కేంద్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఢిల్లీ వేదికగా దీక్ష చేయనుంది. ఎన్నికలలో ప్రజలను ఆకట్టుకునేందుకు, ప్రజా మద్దతు కూడగట్టుకునేందుకు ప్రత్యేక హోదా అంశాన్ని ఆమె బలంగా వినిపిస్తున్నారు.

ఎన్నికల నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలపై జోరుగా ప్రచారం సాగుతోంది. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చేందుకు వైఎస్ షర్మిల ఈ నినాదాన్నే ఎంచుకున్నారు. కాంగ్రెస్ పార్టీతోనే ప్రత్యేక హోదా సాధ్యమవుతుందని ప్రచారం చేస్తున్నారు. లోక్‌సభ సమావేశాల నేపథ్యంలో ప్రత్యేక హోదా డిమాండ్ కోసం షర్మిల దీక్ష చేయనున్నారు. ఇప్పటికే ఆమె ప్రధాని నరేంద్ర మోడీకి లేఖను కూడా రాశారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఢిల్లీ వేదికగా ఆమె తన గళాన్ని వినిపించనున్నారు.

ఢిల్లీలో తాను చేస్తున్న దీక్షకు సీపీఐ, సీపీఎంతో సహా పలు జాతీయ పార్టీల నాయకులు మద్దతు ఇవ్వాలని ఆమె కోరనున్నారు. ఏపీ సమస్యలపై ఢిల్లీలో షర్మిల దీక్ష చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఏపీలో మద్దతు లభిస్తుందని షర్మిల భావిస్తున్నారు. అందుకే రాజకీయ విశ్లేషకులతో ఆమె మంతనాలు కూడా జరిపినట్లు తెలుస్తోంది. అయితే షర్మిల దీక్షకు టీడీపీ, జనసేన పార్టీల మద్దతు ఉంటుందా లేదా అనే విషయంపై స్పష్టత లేదు. ఈ విషయంలో వైసీపీ కూడా ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. మొత్తానికి వైఎస్ షర్మిల ఏపీలో తన గళాన్ని వినిపిస్తూ ప్రజలకు చేరువవుతున్నారు. ఇది ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Updated : 2 Feb 2024 3:15 AM GMT
Tags:    
Next Story
Share it
Top