భారత్, బంగ్లా మూడో వన్డే టై.. సిరీస్ సమం
X
భారత్, బంగ్లాదేశ్ మహిళల జట్ల మధ్య జరిగిన మూడో వన్డే టైగా ముగిసింది. 226 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో టీమిండియా 49.3 ఓవర్లలో 225 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
భారత బ్యాటర్లలో హర్లీన్ (77), స్మృతి మంధాన (59), అర్ధశతకాలు చేయగా.. చివర్లో జెమిమా రోడ్రిగ్స్ (33) పోరాడినా ఫలితం లేకుండా పోయింది. చివరి ఆరు వికెట్లను భారత్ కేవలం 34 పరుగుల వ్యవధిలోనే కోల్పోయింది. దీంతో మూడు వన్డేల సిరీస్లో 1-1తో ఇరు జట్లు సమంగా నిలిచాయి.
కొంపముంచిన రనౌట్లు..
టీమిండియా స్కోర్ 171-4గా ఉన్న సమయంలో వర్షం అంతరాయం కలిగించింది. దీంతో మ్యాచ్ను కాసేపు నిలిపివేశారు. అప్పటికీ భారత జట్టు విజయానికి కావాల్సింది 55 పరుగులే. దీంతో టీమిండియా సునాయసంగా గెలుస్తుందని అంతా భావించారు. కానీ మ్యాచ్ ప్రారంభమైన కాసేపటికే మ్యాచ్ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. స్కోర్ 191 వద్ద హర్లీన్, 192 దీప్తి శర్మలు ఒకే ఓవర్లో రనౌట్లు కావడంతో బంగ్లాదేశ్ రేసులోకి వచ్చింది.
కీలక మలుపు
చివరికి 216-6తో ఉన్నప్పుడు కావాల్సింది 10 పరుగులే కావడంతో భారత్ గెలుపు ఖాయమనిపించింది. ఇంకా 4 ఓవర్లు మిగిలి ఉండడంతో విజయంపై ధీమా వ్యక్తం చేశారు. కానీ రబేయా ఖాన్ వేసిన 47వ చివరి బంతికి అమంజోత్ కౌర్(10) ఔట్ కావడంతో మ్యాచ్ కీలక మలుపు తిరిగింది. నహిదా అక్టర్ వేసిన ఆ తర్వాతి ఓవర్లో స్నేహ రానా, దేవికా వైద్య డకౌట్లు కావడంతో మ్యాచ్ బంగ్లాదేశ్ చేతుల్లోకి వెళ్లిపోయింది. 5 బంతుల వ్యవధిలోనే భారత్ 3 వికెట్లు కోల్పోయింది. 217 పరుగులకు టీమిండియా 9 వికెట్లు కోల్పోయింది.
చివరిలో ఉత్కంఠ
చివరి ఓవర్కు 3 పరుగులు అవసరంకాగా చేతిలో ఒక వికెట్ ఉంది. మొదటి బంతికి మేఘనా సింగిల్ తీయగా, తర్వాతి బంతికి కూడా రోడ్రిగ్స్ ఒక్క పరుగు మాత్రమే రాబట్టింది. అయితే మూడో బంతికి మేఘనా ఔట్ కావడంతో స్కోర్లు సమం అయ్యాయి. దీంతో ఎలాంటి సూపర్ ఓవర్ లేకుండా మ్యాచ్ను టైగా అంపైర్లు ప్రకటించారు.
ఫర్గానా హోక్ సెంచరీ..
అంతకుముందు బంగ్లా జట్టు 50 ఓవర్లలలో 225 పరుగులు చేసింది. ఓపెనర్ ఫర్గానా హోక్(107) సెంచరీతో చెలరేగింది. భారత్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ 156 బంతుల్లో బంతుల్లోనే మూడంకెల స్కోర్ను అందుకుంది. తద్వారా . బంగ్లాదేశ్ తరఫున సెంచరీ కొట్టిన తొలి మహిళా క్రికెటర్గా ఫర్గానా హోక్ రికార్డు సృష్టించింది. 160 బంతుల్లో 107 పరుగులు చేసిన ఫర్గానా హోక్ ఇన్నింగ్స్ చివరి బంతికి రనౌట్ అయింది. మరో ఓపెనర్ షమీమా సుల్తానా(52) అర్ధసెంచరీతో రాణించింది. భారత బౌలర్లలో స్నేహ రానా 2, దేవికా వైద్య ఒక వికెట్ తీశారు.