Home > తెలంగాణ > సీఎంకు బండి సంజయ్ లేఖ.. వారిని ఆదుకోవాలని వినతి : బండి సంజయ్

సీఎంకు బండి సంజయ్ లేఖ.. వారిని ఆదుకోవాలని వినతి : బండి సంజయ్

సీఎంకు బండి సంజయ్ లేఖ.. వారిని ఆదుకోవాలని వినతి : బండి సంజయ్
X

సిరిసిల్ల జిల్లాలో వస్త్ర పరిశ్రమ తీవ్రమైన సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందని బీజేపీ ఎంపీ బండి సంజయ్ అన్నారు. ప్రభుత్వం బతుకమ్మ చీరలకు సంబంధించిన రూ.220 కోట్లు చెల్లించకపోవడంతో వస్త్ర పరిశ్రమ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందని అన్నారు. గతంలో బీఆర్ఎస్ ఎన్నికల కోడ్ ను సాకుగా చూపి బకాయిలను చెల్లించలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఈ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ లేఖ రాశారు.

‘‘ వస్త్ర రంగంపై ఆధారపడ్డ 20 వేల మంది కార్మికులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిరిసిల్ల ప్రాంతంలో మొత్తం 33 వేల మరమగ్గాలుండగా, ఇందులో 28 వేల మగ్గాలపై పాలిస్టర్ వస్త్రాలు, 5 వేల మగ్గాలపై కాటన్ వస్త్రాలు తయారవుతున్నాయి. ఉత్పత్తి వ్యయం పెరగడం, పాలిస్టర్ బట్టకు గిట్టుబాటు ధర, సరైన మార్కెట్ లేకపోవడంతో సిరిసిల్లలో సాంచాలను బంద్ పెట్టారు. దీనికి ప్రధాన కారణం గత బీఆర్ఎస్ ప్రభుత్వంతోపాటు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలే. గత ఏడేళ్లుగా ప్రభుత్వ ఆర్డర్లపైనే ఆధార పడి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ మనుగడ సాగిస్తోంది. వస్తోత్పత్తిదారులు సొంతంగా వస్త్ర వ్యాపారం చేయడం లేదు. ప్రధానంగా బతుకమ్మ చీరలకు సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికులకు రూ.220 కోట్లను బకాయి పెట్టింది. ఈ బకాయిలు రాకపోవడంతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి’’ అని సంజయ్ అన్నారు.

ఈ బకాయిలను చెల్లిస్తామని అప్పట్లో కేటీఆర్ పలుమార్లు హామీ ఇచ్చినా ఇప్పటివరకు చెల్లించలేదని బండి సంజయ్ మండిపడ్డారు. ‘‘కార్మికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మీరు ఈ మొత్తం బకాయిలను వెంటనే చెల్లించాలని కోరుతున్నా. అలాగే ప్రభుత్వ ఆర్డర్లతో సిరిసిల్ల కార్మికులు ఉపాధి పొందుతున్న నేపథ్యంలో మీరు ప్రత్యేక చొరవ తీసుకొని భారీగా ప్రభుత్వ ఆర్డర్లను ఇచ్చి సిరిసిల్ల కార్మికులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. సిరిసిల్లలో మరమగ్గాలను ఆధునీకరించాల్సిన అవసరం ఎంత్కెనా ఉంది. మరమగ్గాల ఆధునీకరణకు అవసరమైన నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లాగే సిరిసిల్లలో మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తగిన ప్రతిపాదనలు పంపితే దీన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరగా మంజూరు చేయించేందుకు నా వంతు కృషి చేస్తాను’’ అని సంజయ్ స్పష్టం చేశారు.

Updated : 17 Jan 2024 12:37 PM GMT
Tags:    
Next Story
Share it
Top