మసాజ్ సెంటర్ కోసమని బంజారాహిల్స్కు వెళుతున్నారా.. బీ కేర్ఫుల్
X
హైదరాబాద్లోని బంజారాహిల్స్ రోడ్ నెం.12 ... గత కొంతకాలంగా ఆశ్లీల కార్యకలాపాల కారణంగా వార్తల్లో నిలుస్తోంది. గత నెల జులైలో రువాన్ థాయ్ అనే స్పా సెంటర్ పై స్థానికుల నుంచి ఫిర్యాదులు అందడంతో పోలీసులు దాడులు నిర్వహించగా.. మసాజ్ ముసుగులో వ్యభిచారం చేయిస్తున్న ముఠా గుట్టు రట్టయింది. థాయిలాండ్ కు చెందిన యువతులతో మసాజ్ పేరిట వ్యభిచారం నిర్వహిస్తూ.. సల్మాన్, ఖాలీద్ అనే యజమానులు పోలీసులకు పట్టుబడ్డారు. అంతకుముందు మార్చిలో కూడా ఢిల్లీకి చెందిన మహేష్ సింగ్ అనే వ్యక్తి.. హ్యాపీ థాయ్ స్పా పేరుతో వ్యభిచార దందా చేశాడు. వెస్ట్ బెంగాల్, ముంబై, నోయిడా, కూకట్పల్లి, ఎన్బీటీనగర్, ఉత్తరప్రదేశ్, ఘజియాబాద్, తదితర ప్రాంతాలకు చెందిన పది మంది యువతులకి 12 వేల నుంచి 15 వేల వరకు జీతాలు ఇస్తూ వారిని వ్యభిచారులుగా మార్చాడు. పోలీసులకు ఈ స్పా సెంటర్ గురించి ఫిర్యాదులు అందడంతో.. మహేష్ సింగ్, మేనేజర్ ఆర్తి మండల్ అలియాస్ రానా, ఇంద్రపాల్ కౌర్పై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు.
అయితే అదే ప్రాంతంలో వ్యభిచారం జరుగుతుండడం.. అసలు బంజారాహిల్స్ రోడ్ నెం.12లో ఎన్ని నిజమైన స్పా సెంటర్లు ఉన్నాయ్.. ఎన్ని నకిలీ మసాజ్ సెంటర్లు ఉన్నాయనే సందేహాలు కలుగుతున్నాయి. రోడ్ నెం.12లోని హెవెన్ ఫ్యామిలీ స్పాలో కొంత కాలంగా వ్యభిచారం జరుగుతున్నట్లుగా తాజాగా పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ఇక్కడ దాడులు నిర్వహించి అయిదుగురు సెక్స్ వర్కర్లను పునరావాస కేంద్రానికి తరలించారు. నిర్వాహకులు కె.నీలిమ, ఎన్.కార్తీక్లపై కేసు నమోదు చేశారు. మరో స్పా సెంటర్ ది వెల్వెట్ స్పాలో కూడా మసాజ్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో ఎస్ఐ కరుణాకర్రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. దాడుల్లో పట్టుబడ్డ నలుగురు సెక్స్ వర్కర్లను పునరావాస కేంద్రానికి తరలించారు. నిర్వాహకులు జ్యోతి బజాజ్, సయ్యద్ యూసుఫ్ బాషాలపై కేసు నమోదు చేశారు.