Home > తెలంగాణ > ఎకరం రూ.100 కోట్లు.. సీఎం కేసీఆర్‌ ఏమన్నారో తెలుసా..!!

ఎకరం రూ.100 కోట్లు.. సీఎం కేసీఆర్‌ ఏమన్నారో తెలుసా..!!

ఎకరం రూ.100 కోట్లు.. సీఎం కేసీఆర్‌ ఏమన్నారో తెలుసా..!!
X

హైదరాబాద్‌ చరిత్రలోనే ఎకరా భూమి అత్యధిక ధర పలికింది. హైదరాబాద్‌ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ ఆథారిటీ (HMDA) ఆధ్వర్యంలో కోకాపేటలో 239, 240 సర్వే నంబర్లలో అభివృద్ధి చేసిన నియో పోలిస్‌ లేఅవుట్లలో తాజాగా ఎకరం రూ.100.75 కోట్లకు అమ్ముడుపోయింది. అక్కడ గత ఏడాది జరిగిన భూముల వేలంలో అత్యధికంగా ఎకరం రూ.60.20 కోట్లకు దక్కించుకున్న రాజపుష్ప రియల్టీ సంస్థే.. ఈసారి ఎకరం రూ.100 కోట్లు పెట్టి కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చింది. ఎకరాకు రూ.35 కోట్లు కనీస ధరను హెచ్‌ఎండీఏ అధికారులు(HMDA officials) నిర్ణయించగా.. అధికారుల అంచనాలకు మించి సగటున ఎకరం ధర రూ.73.23 కోట్లు పలికింది.

గురువారం కోకాపేటలో నిర్వహించిన భూముల వేలంలో ఎకరం ధర రూ.100 కోట్ల పలకడంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పందిస్తూ.. హైదరాబాద్‌లో భూములకు పలికిన ధర తెలంగాణ పరపతికి దర్పణం అన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు చేసిన కృషికి ఫలితం ఇదని తెలిపారు. తెలంగాణ పరపతి, సాధిస్తున్న ప్రగతికి పెరిగిన భూములు ధరలే నిదర్శనమన్నారు. ప్రపంచస్థాయి దిగ్గజ కంపెనీలు పోటీ పడి మరీ ఇంత ధర చెల్లించి తెలంగాణ భూములు కొనడాన్ని ఆర్థిక కోణంలో మాత్రమే కాకుండా తెలంగాణ సాధించిన ప్రగతి కోణంలో విశ్లేషించాలన్నారు. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా హైదరాబాద్ నగర అభివృద్ధి సూచిక అందనంత ఎత్తుకు దూసుకుపోతున్న వర్తమాన పరిస్థితికి అద్దం పడుతున్నదని సీఎం తెలిపారు.

తెలంగాణ వస్తే హైదరాబాద్ ఆగం అవుతుందని, భూముల రేట్లు పడిపోతాయని భయభ్రాంతులకు గురి చేసి హైదరాబాద్ ఆత్మ గౌరవాన్ని కించ పరిచిన వారి చెంప చెళ్లుమనిపించే చర్యగా ఈ భూముల ధరల వ్యవహారాన్ని అర్థం చేసుకోవాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఎవరెంత నష్టం చేయాలని చూసినా ధృఢ చిత్తంతో పల్లెలను, పట్టణాలను ప్రగతి పథంలో నడిపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ పట్టుదలకు, హైదరాబాద్ వంటి మహానగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషికి దక్కిన ఫలితమని అన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరాభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న హెచ్ఎండీఏ అధికారులను, మంత్రి కేటీఆర్‌ను సీఎం కేసీఆర్‌ అభినందించారు. హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్, ఎంఏయూడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్‌లను ప్రశంసించారు.

ప్రభుత్వ నిర్ణయం మేరకు హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో జరిగిన భూముల ఈ-వేలం ద్వారా జరిగిన విక్రయంలో దేశ వ్యాప్తంగా పలు దిగ్గజ కంపెనీలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా జరిగిన వేలంలో తెలంగాణ భూములకు కనీవినీ ఎరుగని ధర పలికింది. రంగారెడ్డి జిల్లా, గండిపేట మండలం, కోకాపేట లోని నియో పోలీస్ ఫేస్ టు లో జరిగిన వేలంపాటలో ఎకరానికి రూ. 100.75 కోట్లను చెల్లించి పోటీదారులు ప్లాట్లను దక్కించుకున్నారు. ప్రభుత్వానికి మొత్తంగా రూ. 3319 కోట్ల ఆదాయం వచ్చింది.


Updated : 4 Aug 2023 2:20 AM GMT
Tags:    
Next Story
Share it
Top