పోడు భూములకు పట్టాలు పంపిణీ...
X
పోడు భూముల కోసం పోరాడిన గిరిజనులపై కేసులను ఎత్తివేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఆ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చర్యలు తీసుకోవాలని కోరారు. శుక్రవారం ర్ ఆసిఫాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించారు. ముందుగా చిల్డ్రన్ పార్క్లో కొట్నాక్ భీంరావ్ విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులు అర్పించారు. అనంతరం ఎస్పీ కార్యాలయం, కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ కార్యాలయన్నికూడా కేసీఆర్ ప్రారంభించారు. తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావించి తీసుకొచ్చిన పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆసిఫాబాద్, సిర్పూర్ (టి) నియోజకవర్గ ఆదివాసీలకు పోడు పట్టాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ " రాష్ట్రవ్యాప్తంగా లక్షా 51 వేల మంది రైతులకు 4.06 లక్షల ఎకరాలకుపైగా పోడు భూముల పట్టాలను పంపిణీ చేస్తున్నాం. పోడు పట్టాలన్నింటినీ మహిళల పేరు మీదే అందిస్తున్నాం. రెండు మూడు రోజుల్లో పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం. పట్టాలు పొందిన వారికి రైతు బంధు కూడా ఇస్తున్నాం.
గతంలో పోడు భూములను ఆక్రమించారని గిరిజనుల మీద కేసులు నమోదయ్యాయి. పట్టాలిచ్చిన తర్వాత వారి మీద కేసులుండడం సరికాదు. వారిమీద నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలని నిర్ణయించాం. అందుకోసం అనుసరించాల్సిన ప్రక్రియపై సీఎస్, డీజీపీకి ఆదేశాలు జారీ చేస్తాం. జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న పోడు భూములకు ఇకపై 3ఫేజ్ విద్యుత్ సరఫరా చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం. ‘గిరివికాసం’ కింద బోర్లు వేసుకునేందుకు అవకాశం కల్పిస్తాం’’ అని కేసీఆర్ తెలిపారు.