Home > తెలంగాణ > 50 ఏళ్ల కాంగ్రెస్‌ దరిద్రాన్ని పదేళ్లలో పోగొట్టాం : కేసీఆర్

50 ఏళ్ల కాంగ్రెస్‌ దరిద్రాన్ని పదేళ్లలో పోగొట్టాం : కేసీఆర్

50 ఏళ్ల కాంగ్రెస్‌ దరిద్రాన్ని పదేళ్లలో పోగొట్టాం : కేసీఆర్
X

బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసమని సీఎం కేసీఆర్ అన్నారు. గతంలో 50ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ తెలంగాణ అభివృద్ధికి చేసిందేమి లేదని విమర్శించారు. కాంగ్రెస్‌ హయాంలో సంక్షేమం ఎలా జరిగిందో.. పదేళ్ల బీఆర్ఎస్ పాలన ఎలా ఉందో ప్రజలు ఆలోచించాలని కోరారు. నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం ప్రసంగించారు. తెలంగాణను ఆంధ్రతో కలిపిందే కాంగ్రెస్ అని.. మళ్లీ మన రాష్ట్రాన్ని మనం సాధించడానికి 58ఏళ్లు పట్టిందన్నారు. మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణ ఆగమైతదని చెప్పారు.

50 ఏళ్ల కాంగ్రెస్‌ దరిద్రాన్ని బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో పోగొట్టామని కేసీఆర్ చెప్పారు. ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకు సాగామన్నారు. కడుపుకట్టుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే.. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్లు వచ్చి ఒక్క ఛాన్స్ అంటున్నారని.. వాళ్లని నమ్మొద్దని సూచించారు. కాంగ్రెస్ పాలనలో 200 ఉన్న పెన్షన్ ను ఈ సారి అధికారంలోకి వస్తే 5వేలకు పెంచుతామన్నారు. అదేవిధంగా రైతు బంధును 16వేలు చేస్తామన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు సాగునీరు, మంచి నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారని విమర్శించారు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో పడేస్తామంటున్నారని.. అదే జరిగితే మళ్లీ పైరవీకారుల రాజ్యం వస్తుందని అన్నారు. ధరణి ఉండడం వల్లే రైతు బంధు నిధులు సకాలంలో జమ అవుతున్నాయని తెలిపారు. దేశంలోనే 24గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ఒక్కటే అన్నారు. కాంగ్రెస్ నేతలు రైతు బంధు దుబారా.. మూడు గంటల కరెంట్ చాలని అంటున్నారని.. వారికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే.. బీఆర్ఎస్ అభ్యర్థి జాన్సన్ నాయక్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

Updated : 26 Nov 2023 10:21 AM GMT
Tags:    
Next Story
Share it
Top