Home > తెలంగాణ > వీఆర్ఏ వ్యవస్థ రద్దు.. చారిత్రక నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్..

వీఆర్ఏ వ్యవస్థ రద్దు.. చారిత్రక నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్..

వీఆర్ఏ వ్యవస్థ రద్దు.. చారిత్రక నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్..
X

వీఆర్ఏలకు సంబంధించి సీఎం కేసీఆర్ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. భూస్వామ్య వ్యవస్థకు చిహ్నాలుగా మిగిలిన వీఆర్ఏ వ్యవస్థను శాశ్వతంగా రద్దుచేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో వీఆర్ఏలుగా పనిచేస్తున్న సిబ్బందిని రెవెన్యూ శాఖలో సూపర్ న్యూమరరీ పోస్టుల్లో క్రమబద్ధీకరించనున్నట్టు సీఎం ప్రకటించారు. మంత్రుల సబ్ కమిటీ సిఫార్సులు, నిబంధనలను అనుసరించి వీఆర్ఏల అర్హత ఆధారంగా మున్సిపాలిటీ, మిషన్ భగీరథ, ఇరిగేషన్ శాఖల్లో సర్దుబాటు చేయనున్నారు. వారందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. దీనికి సంబంధించి జులై 24 సోమవారం రోజున ఉత్తర్వులు జారీ చేయాలని సీఎస్ శాంతి కుమారిని ఆదేశించారు.





ఉద్యోగ భద్రత

సామాజిక పరిణామ క్రమంలో మార్పులకనుగుణంగా, ప్రజల అవసరాలను అనుసరించి పాలకులు నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని సీఎం అన్నారు., కాలానుగుణంగా కనుమరుగవుతున్న వృత్తుల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యామ్నాయంగా ఉద్యోగ భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వ్యవసాయం అభివృద్ధి చెంది సాగునీటి విధానం అమల్లోకి వచ్చిన నాటి కాలంలో ప్రతి గ్రామంలో నీటి వ్యవస్థను సక్రమంగా నిర్వహించడంతో పాటు గ్రామ రెవెన్యూ తదితర అవసరాల కోసం ఏర్పాటైన గ్రామ సహాయకుల వ్యవస్థ నేటి వీఆర్ఏలుగా రూపాంతరం చెందిందని సీఎం చెప్పారు. అలా తరతరాలుగా సామాజిక సేవ చేస్తున్న వీఆర్ఏల త్యాగపూరిత సేవ గొప్పదని కేసీఆర్ కొనియాడారు. అయితే మారిన పరిస్థితుల్లో వీఆర్ఏల వృత్తికి ప్రాధన్య‌తా తగ్గిన నేపథ్యంలో, వారికి రెవెన్యూ శాఖలో సూపర్ న్యూమరరీ పోస్టులను కల్పించి, పర్మినెంట్ చేసి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు.

కారుణ్య నియామకం

ఉన్నత చదువులు చదివి ప్రమోషన్లకు అర్హులైన వారికి అందుకనుగుణమైన పోస్టుల్లో భర్తీ చేయనున్నట్టు సీఎం చెప్పారు. ఇందుకు సంబంధించి చర్యలు చేపట్టి, విధివిధానాలు ఖరారు చేసి, సోమవారం ఉత్తర్వులు జారీ చేయాలని రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. 61 ఏండ్లు పైబడిన వీఆర్ఏల వారసులకు కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని సీఎం నిర్ణయించారు. 2 జూన్ 2014 అనంతరం 61 ఏండ్ల లోపు ఉండి విధులు నిర్వహిస్తూ మరణించిన వీఆర్ఏల వారసులకు కూడా ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఈ మేరకు చనిపోయిన వీఆర్ఏల వారసుల వివరాలు, వారి విద్యార్హతలు త్వరలో సేకరించాలని అధికారులను ఆదేశించారు. వారికి కూడా నిబంధనలకు అనుసరించి అర్హతల మేరకు, ఆయా శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో సర్దుబాటు చేయాలని అన్నారు.

‘డిగ్నిటీ ఆఫ్ లేబర్’కు ప్రాధాన్య‌ం

తరతరాలుగా సమాజ సేవ చేస్తున్న వీఆర్ఏలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సహాయం వారి వ్యక్తిగతంగా మాత్రమే కాదని, ఇది సమాజానికి చేస్తున్న సేవగా భావిస్తున్నామని సీఎం అభిప్రాయపడ్డారు. అట్టడుగు స్థాయి నుంచి త్యాగాలతో, శ్రమతో సమాజ శ్రేయస్సు కోసం పనిచేసే వారి విషయంలో ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు. సఫాయన్నా.. నీకు సలామన్నా..’ అంటూ ‘డిగ్నిటీ ఆఫ్ లేబర్’కు ప్రాధాన్యతనిస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని సీఎం గుర్తు చేశారు.

కేసీఆర్‌కు ధ‌న్య‌వాదాలు..

నీరటి, మస్కూరు, లష్కర్ తదితర పేర్లతో తరతరాలుగా వెంటాడుతున్న సామాజిక వివక్షతో కూడిన విధుల నుంచి తమకు విముక్తి కల్పించి, ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేసినందుకు వీఆర్ఏలు సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు చెప్పారు. ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ముఖ్యమంత్రికి రుణపడి ఉంటామని చెప్పారు.




Updated : 23 July 2023 4:07 PM GMT
Tags:    
Next Story
Share it
Top