Home > తెలంగాణ > దసరా తర్వాత గురుకులాల్లో విద్యార్థులకు చేపల కూర

దసరా తర్వాత గురుకులాల్లో విద్యార్థులకు చేపల కూర

దసరా తర్వాత గురుకులాల్లో విద్యార్థులకు చేపల కూర
X

విద్యార్థుల ఆరోగ్యంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. దసరా కానుకగా, రెండ్రోజుల క్రితం అక్టోబర్ 6వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని తరగతుల విద్యార్థులకు ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకం’ ప్రారంభించిన సర్కార్.. తాజాగా ప్రభుత్వంలోని ఫిష్ ఫెడరేషన్ మరో పథకానికి సిద్ధం చేస్తున్నది. బీసీ గురుకులాల్లోని విద్యార్థులకు భోజనంలో చేపల కూర అందించాలని ఫిష్‌ ఫెడరేషన్‌ నిర్ణయించింది. దసరా తర్వాత ఈ పథకాన్ని అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ప్రస్తుతానికి ఈ పథకాన్ని కేవలం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పరిధిలో పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టాలని నిర్ణయించినట్టు ఫెడరేషన్‌ చైర్మన్‌ పిట్టల రవీందర్‌ తెలిపారు. జగిత్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల పరిధిలోని 33 బీసీ గురుకులాల్లో 15 వేల మందికి లబ్ధి చేకూరనున్నది.

ఒక్కో విద్యార్థికి 150 గ్రాముల చొప్పున, 15 వేల మందికి ప్రతి బుధవారం సుమారు 22 క్వింటాళ్ల చేపలు అవసరం కానున్నాయి. ముళ్లు లేని చేపలను విద్యార్థులకు అందించనున్నారు. పాఠశాలల్లో చేపలు శుభ్రం చేయాల్సిన అవసరం లేకుండా రెడీ టు కుక్‌ విధానంలో అందించనున్నారు. ఇప్పటికే చేపల సరఫరాదారులతోనూ అధికారులు సమావేశమై చర్చించారు. చేపల వంటకాన్ని రుచిగా చేసేందుకు స్కూళ్లలోని వంట మనుషులకు ఒక రోజు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు.


Updated : 8 Oct 2023 3:12 AM GMT
Tags:    
Next Story
Share it
Top