Home > తెలంగాణ > Komuravelli : కొమురవెల్లిలో రైల్వేస్టేషన్‌ నిర్మాణానికి నేడు భూమిపూజ

Komuravelli : కొమురవెల్లిలో రైల్వేస్టేషన్‌ నిర్మాణానికి నేడు భూమిపూజ

Komuravelli : కొమురవెల్లిలో రైల్వేస్టేషన్‌ నిర్మాణానికి నేడు భూమిపూజ
X

కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ నిలయమైన సిద్దిపేట జిల్లా కొమురవెల్లి (హాల్ట్) రైల్వే స్టేషన్ నిర్మాణానికి ఇవాళ కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. మంత్రులు కొండ సురేఖ, పొన్నం ప్రభాకర్‌‌లు, రైల్వే అధికారుల సమక్షంలో శంకుస్థాపన జరగనుంది. 500 ఏళ్ల నాటి పురాతన శివాలయమైన కొమురవెల్లి మల్లన్న దేవాలయానికి తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. మరీ ముఖ్యంగా ప్రతి ఏటా సంక్రాంతి నుంచి ఉగాది వరకు జరిగే జాతరలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు.ఈ ఆలయ పట్టణం యొక్క ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని, రైల్వే మంత్రిత్వ శాఖ సెంట్రల్ తెలంగాణలోని కొమురవెల్లిలో హాల్ట్ స్టేషన్‌ను ప్రారంభించేందుకు ఆమోదించింది. కొత్త హాల్ట్ స్టేషన్ మొదటిసారిగా రైలు కనెక్టివిటీని అందిస్తుంది, ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుంది.

ఈ స్టేషన్ మనోహరాబాద్ – కొత్తపల్లి కొత్త రైలు మార్గంలో ఉంది. మనోహరాబాద్ – సిద్దిపేట రైలు మార్గాన్ని ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేసిన విషయం విధితమే. దీంతో కొమురవెల్లిలో భక్తుల సౌకర్యార్థం.. రైల్వే స్టేషన్ ఉండాలంటూ డిమాండ్లు రావడంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ తీసుకుని.. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు కొమురవెల్లిలో రైల్వేస్టేషన్ అవసరాన్ని వివరించారు. దీనిపై చర్చించిన తర్వాత కొమురవెల్లిలో మల్లన్న భక్తుల సౌకర్యార్థం రైల్వేస్టేషన్ నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం కొమురవెల్లి లో రైల్వేస్టేషన్ నిర్మాణానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ హాజరుకానున్నారు.

హాల్టింగ్ స్టేషన్ ఏర్పాటుతో లక్షలాది మంది భక్తులకు ప్రయోజనం చేకూరనుంది. నాలుగు రాష్ట్రాల నుంచి ఏటా 25 నుంచి 30 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. వీరిలో 70 శాతం మంది సాధారణ భక్తులే. వీరంతా ఆర్టీసీ బస్సులు, ఇతర ప్రైవేట్ వాహనాల్లో ఆలయానికి చేరుకుంటారు. కానీ బస్సుల్లో వచ్చే వారు రాజీవ్ రహదారికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొమురవెల్లికి చేరుకుంటారు. భక్తులు, ప్రయాణికులు ఇళ్లకు వెళ్లేందుకు ప్రధాన రహదారిపై గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులు 110 కిలోమీటర్లు, కరీంనగర్ నుంచి వచ్చే భక్తులు 90 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. హైదరాబాద్ నుంచి ఒక్కొక్కరికి రూ.100 నుంచి రూ.150, కరీంనగర్ నుంచి రూ. 100 ఖర్చు అవుతుంది. రైలులో ప్రయాణిస్తే సగం భారం తగ్గుతుంది. కొమురవెల్లి సమీపంలో రైల్వేస్టేషన్‌ నిర్మాణంతో పేద, మధ్య తరగతి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని భక్తులు హర్షం వ్యక్తం చేశారు.

Updated : 15 Feb 2024 3:22 AM GMT
Tags:    
Next Story
Share it
Top