Home > తెలంగాణ > ఛైర్మన్, సభ్యుల రాజీనామాకు గవర్నర్ ఆమోదం

ఛైర్మన్, సభ్యుల రాజీనామాకు గవర్నర్ ఆమోదం

ఛైర్మన్, సభ్యుల రాజీనామాకు గవర్నర్ ఆమోదం
X

టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల నియామకానికి లైన్ క్లియర్ అయింది. ఛైర్మన్, మెంబర్ల రాజీనామాకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదముద్ర వేశారు. దాదాపు నెల రోజుల తర్వాత వారి రాజీనామాలను ఆమోదిస్తూ గవర్నర్ సంతకం చేశారు. ఈ విషయంలో ఎలాంటి అభ్యంతరం లేదని రేవంత్ రెడ్డి సర్కారు లేఖ రాయడంతో తమిళిసై ఈ నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ నిర్ణయంతో త్వరలోనే ప్రభుత్వం టీఎస్పీఎస్సీకి కొత్త ఛైర్మన్, సభ్యులను నియమించనుంది. ఆ తర్వాత ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టనుంది.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్థన్ రెడ్డి పదవి నుంచి వైదొలిగారు. అనంతరం సభ్యులైన కారం రవీందర్‌రెడ్డి, లింగారెడ్డి, సుమిత్ర ఆనంద్‌ తానోబా, అరుణ కుమారి రాజీనామా లేఖల్ని గవర్నర్కు పంపారు. అయితే వారి రాజీనామాలు ఆమోదించడంలో గవర్నర్ జాప్యం చేశారు. ఈ క్రమంలో ఛైర్మన్, సభ్యుల భర్తీ జరగనందున కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు చేపట్టలేకపోతోందంటూ మంగళవారం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గవర్నర్ తమిళిసైకు లేఖ రాశారు. వారి రాజీనామాలను వెంటనే ఆమోదించాలని కోరారు. ఈ నేపథ్యంలో తమిళిసై టీఎస్పీఎస్సీ బోర్డు ఛైర్మన్ జనార్థన్ రెడ్డితో పాటు మిగిలిన సభ్యుల రాజీనామాలకు ఓకే చెప్పారు.

గవర్నర్ నిర్ణయంతో త్వరలోనే టీఎస్పీఎస్సీకి కొత్త ఛైర్మన్, మెంబర్ల నియామకం జరగనుంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాజ్యాంగబద్ధ సంస్థ అయినందున రాష్ట్ర ప్రభుత్వం ఛైర్మన్ తో పాటు సభ్యుల పేర్లు ప్రతిపాదించనుంది. ప్రభుత్వం పంపిన పేర్లను పరిశీలించిన గవర్నర్ తమిళిసై ఛైర్మన్, సభ్యులను ఎంపిక చేయనున్నారు.

Updated : 10 Jan 2024 8:21 AM GMT
Tags:    
Next Story
Share it
Top