Home > తెలంగాణ > Vishnu Vardhan Reddy: BRSలోకి విష్ణువర్దన్ ను ఆహ్వానించిన మంత్రి హరీష్ రావు

Vishnu Vardhan Reddy: BRSలోకి విష్ణువర్దన్ ను ఆహ్వానించిన మంత్రి హరీష్ రావు

Vishnu Vardhan Reddy: BRSలోకి విష్ణువర్దన్ ను ఆహ్వానించిన మంత్రి హరీష్ రావు
X

కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడిన అసంతృప్త నేతలను బీఆర్ఎస్ ఆకర్షిస్తోంది. ఇందులో భాగంగా సోమవారం మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి (P Vishnuvardhan Reddy) నివాసానికి మంత్రి హరీశ్ రావు వెళ్లారు. ఈ మేరకు విష్ణును బీఆర్ఎస్ లోకి చేరాలని మంత్రి హరీశ్ రావు ఆహ్వానించారు.జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్ అధిష్టానంపై విష్ణు వర్ధన్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నిన్న (ఆదివారం) ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను (CM KCR) కలిసి బీఆర్‌ఎస్‌లో (BRS) చేరికకు విష్ణువర్ధన్ రెడ్డి గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారు.

ఇలాంటి నాయకులు అవసరం

ఇక ఈరోజు విష్ణును కలిసిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. విష్ణువర్ధన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అవమానించిందని విష్ణు బాధపడ్డారని.. తాము, విష్ణు అందరం ఐదేళ్లు శాసనసభ సభ్యులుగా ఉన్నామని తెలిపారు. అనేక ఉద్యమాల్లో విష్ణు తమతో కలిసి పోరాడారని చెప్పారు. బీఆర్ఎస్‌లో చేరాలని విష్ణును కోరినట్లు తెలిపారు.. అందుకు విష్ణు సుముఖత వ్యక్తం చేశారన్నారు. కాంగ్రెస్​ను ఢీ కొట్టాలంటే విష్ణు వర్ధన్ రెడ్డి లాంటి నాయకులు చాలా అవసరమని అన్నారు. కాంగ్రెస్ పార్టీని ఆ పార్టీ నేతలే తిరస్కరిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్‌ హయాంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉండేదని హరీశ్ రావు అన్నారు.

నాడు PCC కొన్నాడు.. నేడు..

పట్టపగలు డబ్బు కట్టలతో దొరికిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని.. సీట్లు అమ్ముకున్న వ్యక్తి రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) అంటూ విరుచుకుపడ్డారు. రూ50కోట్లకు పీసీసీ పదవులు కొనుక్కున్నారని కోమటిరెడ్డి ఆరోపిస్తే అతని మీద చర్యలు తీసుకోలేదని అన్నారు. పీసీసీ పదవి కొనుక్కున రేవంత్‌ రెడ్డి ఇప్పుడు రూ.5కోట్లకు సీట్లు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ఈ రాష్ట్రం ఎవరి చేతుల్లో ఉంటే బాగుంటుంది అనేది జనాలు గుర్తించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రం నాశనం అవుతుందని తెలిపారు. ఈ ఎన్నికలు తెలంగాణ వాదులకు తెలంగాణ ద్రోహులకు మధ్య జరుతుగున్న పోటీ అని చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌లో జరిగిన అభివృద్ధి కళ్ల ముందు కనపడుతోందని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు.

రక్తంలోనే కాంగ్రెస్ ఉందనుకున్నా..

ఇక విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో తనకు ఈ పరిస్థితి వస్తుందని అనుకోలేదని చెప్పారు. టిఆర్‌ఎస్‌ పార్టీలోకి గతంలో కూడా తనను రమ్మని పిలిచినా తమ రక్తంలో కాంగ్రెస్‌ ఉందని రాలేమని చెప్పానన్నారు. తన రక్తంలో కాంగ్రెస్ ఉందని భావించే వాడినని, తన తండ్రి 35ఏళ్లు కాంగ్రెస్‌కు సేవ చేశారని, తాను 17ఏళ్లుగా ఉన్నానని, రెండో జాబితాలో తన పేరు ఉంటుందని భావించానని కానీ పేరు లేదన్నారు. ఇప్పుడున్న నాయకులు త్వరలో గాంధీవన్‌ను కూడా అమ్మేస్తారని, అలాంటి వాళ్లు అధికారంలోకి వస్తే తెలంగాణను అమ్మేస్తారన్నారు. తనను పార్టీలోకి ఆహ్వానించినందుకు బిఆర్‌ఎస్ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

Updated : 30 Oct 2023 7:36 AM GMT
Tags:    
Next Story
Share it
Top