Home > తెలంగాణ > Medaram : మరో 20 రోజుల్లో మహాజాతర..మేడారానికి పోటెత్తిన భక్తులు

Medaram : మరో 20 రోజుల్లో మహాజాతర..మేడారానికి పోటెత్తిన భక్తులు

Medaram  : మరో 20 రోజుల్లో మహాజాతర..మేడారానికి పోటెత్తిన భక్తులు
X

మేడారం (medaram) జాతర ఆసియా(asia)లోనే అతిపెద్ద గిరిజన జాతర. తెలంగాణ కుంభమేళాగా పిలిచే ఈ జాతరకు భక్తులు పోటెత్తారు. మహాజాతరకు మరో 20 రోజులే ఉండడంతో వనదేవతలకు మొక్కులు చెల్లించుకునేందుకు..వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. పెద్ద సంఖ్యలో భక్తుల రాకతో మేడారం పరిసరాలన్నీ కిటకిటలాడుతున్నాయి. జంపన్న వాగులో పుణ్యస్నానాలు చేసి, కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకుంటున్నారు భక్తులు. అమ్మవార్ల దర్శనానికి భక్తులు పోటెత్తుడడంతో మేడారం పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది.

జాతర తేదీలు:

ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు మహాజాతర జరగనుంది. వనదేవతలను దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. గద్దెలపై ఉన్న సమ్మక్క, సారలమ్మను దర్శించుకొని పునీతులవుతున్నారు. దాదాపు కోటి మందికి పైగా ఈ గిరిజన జాతరకు హాజరుకానున్నారు. తెలంగాణ కుంభామేళాగా పిలిచే ఈ జాతరకు సంబంధించి అన్ని ఏర్పాట్లను రాష్ర్ట ప్రభుత్వం పూర్తి చేసింది. అమ్మవార్లకు నిలువెత్తు బంగారం, చీర, సారెలను సమర్పించి, కోళ్లను ఎదురు ఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి అటవీ భోజనాలు చేస్తున్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో అమ్మవార్ల గద్దెల గేట్లకు ఆలయాధికారులు తాళాలు వేశారు.

అమ్మవార్ల రాక, వన ప్రవేశం:

ఫిబ్రవరి 21న కన్నేపల్లి నుంచి సారలమ్మను గద్దెపైకి తీసుకురానున్నారు. అదే రోజున పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజును, కొండాయి గ్రామం నుంచి గోవిందరాజును మేడారం గద్దెలపైకి పూజారులు తీసుకొస్తారు. 22వ తేదీన గిరిజనులు చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లిని తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్టిస్తారు. ఆ మరునాడు వన దేవతలిద్దరూ గద్దెలపై కొలువుదీరి భక్తులకు దర్శనం ఇస్తారు. అమ్మవార్లు గద్దెల మీద కొలువుతీరిన రోజు నుంచి కోట్లాది మంది గిరిజనులు, గిరిజనేతరులు వనదేవతలకు తమ మొక్కులు చెల్లించుకుంటారు. పసుపు కుంకుమలను, వొడి బియ్యాన్ని, బంగారాన్ని (బెల్లం) అమ్మవార్లకు మొక్కులుగా సమర్పిస్తారు. కోడి పుంజులు, మేకపోతులను బలి ఇస్తారు. సమ్మక్క గద్దె చేరే సమయంలో కోడిపుంజులను గాలిలోకి ఎగరవేసి ఆరగింపు చేస్తారు. అంతా అయ్యాక 24వ తేదీన సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు మళ్లీ వనప్రవేశం చేస్తారు.




Updated : 3 Feb 2024 3:59 AM GMT
Tags:    
Next Story
Share it
Top