Home > తెలంగాణ > Harish Rao: తెలంగాణ ప్రజలకు మీరిచ్చే బహుమానం ఇదేనా.. హ‌రీశ్‌రావు ఫైర్

Harish Rao: తెలంగాణ ప్రజలకు మీరిచ్చే బహుమానం ఇదేనా.. హ‌రీశ్‌రావు ఫైర్

Harish Rao: తెలంగాణ ప్రజలకు మీరిచ్చే బహుమానం ఇదేనా..  హ‌రీశ్‌రావు ఫైర్
X

నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వాహణను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు(KRMB) కు అప్పగించాలని కేంద్రం సూచనకు.. తెలంగాణ ప్రభుత్వం అంగీకరించడాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హారీశ్ రావు తప్పుపట్టారు. ప్రాజెక్టుల నిర్వహణను కృష్ణా బోర్డుకు(KRMB) అప్పగిస్తున్నట్లు ఇవాళ రెండు రాష్ట్రాల ఈఎన్సీలు మీడియా ముందు ప్రకటించారని, 27వ తేదీ లేఖ ప్రామాణికమా? ఇవాళ్టి అంగీకారం ప్రామాణికమా? అని ప్రశ్నించారు. ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా తప్పుదోవ పట్టిస్తోందని ఆక్షేపించారు. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించేందుకు అంగీకరించారని తాను చెబితే హరీశ్‌రావు వద్ద పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని, తెలంగాణ ప్రయోజనాలు పరిరక్షిస్తామని గొప్పగా చెప్పారని మాజీ మంత్రి గుర్తు చేశారు.

కానీ ఇవాళ ఏం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల ఆపరేషన్ కృష్ణా బోర్డుకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారని, ఇక నుంచి చుక్క నీరు తీసుకోవాలన్నా కృష్ణా బోర్డు అనుమతి తప్పనిసరని వ్యాఖ్యానించారు. వేసవిలో, రేపు అవసరం పడినపుడు తాగునీటి కోసం నీరు తీసుకునే అధికారం రాష్ట్రానికి ఉంటుందా? అని ప్రశ్నించారు. జల విద్యుత్ హౌస్‌ల గురించి చర్చ లేదని చెప్తున్నారు కానీ, బోర్డు అనుమతి లేకుండా విద్యుత్ ఉత్పత్తి చేయడం సాధ్యమా? అని అడిగారు. బోర్డు అనుమతి లేనిదే రాష్ట్ర ఇంజినీర్లు, అధికారులు కనీసం ప్రాజెక్టుల వద్దకు వెళ్లే పరిస్థితి ఉండబోదని హరీశ్‌రావు పేర్కొన్నారు.

మార్పు అంటే ఇదేనా? తెలంగాణ ప్రయోజనాలు, హక్కులు కేంద్రం, ఏపీ చేతిలో పెట్టడమా అని హరీశ్‌రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ సీట్లు కట్టబెట్టిన పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మంతో పాటు రాష్ట్ర ప్రజలకు ఇచ్చే బహుమానం ఇదేనా అని సర్కార్‌ను నిలదీశారు. అందరితో చర్చిస్తామని చెప్పిన ప్రభుత్వం, ఇవాళ ఎలా అంగీకరించిందని అడిగారు. ప్రాజెక్టులు అప్పగించబోమని ఓ వైపు నాయకులు చెబుతారని, మరోవైపు సమావేశాల్లో అధికారులు అంగీకరించి వస్తారని ఎద్దేవా చేశారు.

Updated : 1 Feb 2024 4:16 PM GMT
Tags:    
Next Story
Share it
Top