Home > తెలంగాణ > రాహుల్ గాంధీని కలిసిన మైనంపల్లి, వేముల వీరేశం

రాహుల్ గాంధీని కలిసిన మైనంపల్లి, వేముల వీరేశం

రాహుల్ గాంధీని కలిసిన మైనంపల్లి, వేముల వీరేశం
X

ఇటీవల బీఆర్ఎస్‌ను వీడిన ప్రధాన నేతలు.. గురువారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో హస్తం కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుతో పాటు ఆయన కుమారుడు రోహిత్, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, కుంభం అనిల్ కుమార్‌లు కాంగ్రెస్‌లో చేరారు. వీరికి ఖర్గే పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. తాజాగా ఈ తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా... పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కలిశారు. నిన్న పార్టీలో చేరిన నేతలతో పాటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్‌చార్జి థాక్రే లు శుక్రవారం ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా వారికి రాహుల్ శుభాకాంక్షలు చెప్పారు. పార్టీ అభివృద్ధికి, వచ్చే ఎన్నికల్లో గెలుపునకు కృషి చేయాలని సూచించారు.





ఇక, తన కుమారుడికి టికెట్ కేటాయించకపోవడంతో మంత్రి హరీష్ రావుపై సంచలన ఆరోపణలు చేసిన మైనంపల్లి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వేముల వీరేశం సైతం బీఆర్ఎస్ టికెట్ కేటాయించకపోవడంతో అసంతృప్తిలో ఉండగా తాజాగా కాంగ్రెస్ గూటికి చేరారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరిన అనంతరం మైనంపల్లి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు అనుకూలమైన వాతావరణం ఉందని, కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం గెలుస్తుందని అన్నారు. బీఆర్ఎస్ లో ఎంత చేయాలో తను అంతా చేశారని.. కార్యకర్తలంతా తనతోనే ఉన్నారని చెప్పారు. వరుస చేరికలతో కాంగ్రెస్ జోష్ మీద ఉండగా.. కీలక నేతలు చేజారుతుండటంతో బీఆర్ఎస్‌లో టెన్షన్ మొదలైందని అంటున్నారు వీరి మద్ధతుదారులు.







Updated : 29 Sep 2023 5:53 AM GMT
Tags:    
Next Story
Share it
Top