Home > తెలంగాణ > నుమాయిష్ ఎగ్జిబిషన్లో లేడీస్ డే, చిల్డ్రన్స్ స్పెషల్.. ఎప్పుడో తెలుసా?

నుమాయిష్ ఎగ్జిబిషన్లో లేడీస్ డే, చిల్డ్రన్స్ స్పెషల్.. ఎప్పుడో తెలుసా?

నుమాయిష్ ఎగ్జిబిషన్లో లేడీస్ డే, చిల్డ్రన్స్ స్పెషల్.. ఎప్పుడో తెలుసా?
X

ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ 83వ ఎగ్జిబిషన్ (నుమాయిష్- 2024).. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఇవాళ్టి నుంచి (జనవరి 1) ప్రారంభం అయింది. సాయంత్రం 5 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఈ ఎగ్జిబిషన్ ను ప్రారంభించనున్నారు. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు.. 46 రోజుల పాటు జరిగే ఈ ఎగ్జిబిషన్ కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎగ్జిబిషన్ విజిటింగ్ అవర్స్ లో ఎలాంటి మార్పులు చేయని నిర్వాహకులు.. టికెట్ ధరలు మాత్రం పెంచారు. గతేడాది టికెట్ ధర రూ.10 ఉండగా.. దాన్ని రూ.40కి పెంచారు. నుమాయిష్కు వేలాది మంది వచ్చే అవకాశముండటంతో భద్రతాపరంగా ఎలాంటి లోపం తలెత్తకుండా పోలీస్ శాఖతో సమన్వయం చేసుకుంటూ ఎగ్జిబిషన్ సొసైటీ అన్ని చర్యలు తీసుకుంది. సీసీ కెమెరాలతో పటిష్ట నిఘా ఏర్పాటుచేసింది.

తెలంగాణ, ఏపీలతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన ఉత్పత్తులను, ప్రభుత్వ స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. ఈసారి ఎగ్జిబిషన్లో దాదాపు 2,400 స్టాల్స్ ఏర్పాటు కానున్నాయి. మామూలు రోజుల్లో సాయంత్రం 4 నుంచి రాత్రి 10:30 వరకు ఎగ్జిబిషన్ ఉండగా.. వీకెండ్స్, సెలవు దినాల్లో మాత్రం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఎగ్జిబిషన్ ఉంటుంది.అంతేకాకుండా మహిళలు, పిల్లలకోసం ప్రత్యేకంగా ఒకరోజును కేటాయిస్తారు. జనవరి 9న లేడీస్ డే, జనవరి 31న చిల్డ్రన్ స్పెషల్ పేరుతో ప్రత్యేక రోజు ఉంటుంది. నుమాయిష్లో ఒకే చోట అన్ని రకాల వస్తువులు అందుబాటులో ఉండనున్నాయి.

అనేక రాష్ట్రాల ఉత్పత్తులు అందుబాటులో ఉండడంతో భారీగా జనాలు వచ్చే అవకాశముంది. ముఖ్యంగా దుస్తులు, వంట సామాగ్రి, దుప్పట్లు, బెడ్‌ షీట్లు, డ్రై ఫ్రూట్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫర్నిచర్, ఇతర ఉపకరణాలు ఎగ్జిబిషన్లో దొరుకుతాయి. ఈ ఏడాది దాదాపు 22 లక్షల మంది నుమాయిష్ కు వస్తారని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేశారు. నుమాయిష్కు వచ్చే సందర్శకులను గోషా మహల్, అజంతా గేట్, గాంధీ భవన్ గేట్ల వద్ద తనిఖీ చేసిన అనంతరం లోపలికి పంపిస్తారు. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా నిర్వాహకులు సందర్శకుల కోసం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు.

Updated : 1 Jan 2024 10:01 AM GMT
Tags:    
Next Story
Share it
Top