Home > తెలంగాణ > తెగే దాకా లాగి ఆ కమలనాథుడు కాంగ్రెస్‌లోకి!

తెగే దాకా లాగి ఆ కమలనాథుడు కాంగ్రెస్‌లోకి!

తెగే దాకా లాగి ఆ కమలనాథుడు కాంగ్రెస్‌లోకి!
X

చావో రేవో తేల్చుకోవాల్సిన కీలక ఎన్నికలకు గట్టిగా నాలుగైదు నెలల వ్యవధి కూడా లేని సమయంలో తెలంగాణ బీజేపీ అల్లకల్లోలం రేగుతోంది. ఒకపక్క అంతర్గత కుమ్ములాటలు, మరోపక్క పార్టీని ఎన్నికలకు సిద్ధం చేయాల్సిన పరిస్థితి నడుమ కమలనాథులు బిక్కచూపులు చూస్తున్నారు. దీనికి తోడు ఏకంగా అధిష్టానంపైనే కత్తులు నూరుతున్న ఎమ్మెల్యేలను కట్టడం చేయడం సాధ్యం కావడం లేదు. ఇన్నేళ్లుగా పార్టీని నమ్ముకున్న ఉన్న తనకు న్యాయం చేయకపోతే జాతీయ నాయకత్వంపై ప్రభుత్వ పెద్దకు ఫిర్యాదు చేస్తానని ఓ లాజిక్ ఎమ్మెల్యే హెచ్చరించడం పరిస్థితికి అద్దం పడుతోంది. తను కోరుకున్న పదవుల్లో ఏదో ఒకటి ఇవ్వాలని పట్టుబడుతున్న ఆయనతోపాటు పలువురు నాయకులు ఈ రోజు అధిష్టానం తీసుకున్న నిర్ణయంతో ఏం చేయాలో దిక్కతోచక ‘పక్క చూపులు’ చూస్తున్నారు.

తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్‌ను తప్పించి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని ఆ స్థానంలో తీసుకురావడం, ఈటల రాజేందర్‌కు ఎన్నికల కమిటీ పగ్గాలను అప్పగించడంతో అగ్రహంతో ఉన్న ఆ ఎమ్మెల్యే తదుపరి కార్యాచరణకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదవరకు తను పనిచేసిన పార్టీలో ఏది ఉత్తమం, ఎందులో చేరితే తనకు ప్రాధాన్యం ఉంటుంది, ప్రజల్లో తన విశ్వసనీయత దెబ్బతినదు? వంటి అన్ని అంశాలను బేరీజు వేసుకుని నిర్ణయం తీసుకుంటున్నారని చెబుతున్నారు. ఈ క్షణం వరకు అధికార పార్టీని తిట్టిపోసిన తను ఉన్నపళంగా ఆ పార్టీలోకి వెళ్తే విమర్శలు వస్తాయని భావిస్తున్నారు. ఇదివరకు పనిచేసిన కాంగ్రెస్‌లోకి వెళ్లడం తప్ప మరో గత్యంతరం లేదన్నది ఆయన ఆలోచన. కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం కాస్త జోష్ కనిపిస్తుండడంతో అందులోకి వెళ్తే ప్రాధాన్యంతోపాటు కీలక పదవి దక్కొచ్చని భావిస్తున్నారు. మీడియా ఎదుట తన వాగ్ధాటి, రెండు ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీల్లో పనిచేసిన అనుభవం, ఆ పార్టీల లోటుపాట్లపై అవగాహన కాంగ్రెస్‌ వ్యూహరచనకు పనికొస్తాయని ఆయన ఆలోచన.

అయితే అంతర్గత అతి ప్రజాస్వామ్యానికి పేరొందిన కాంగ్రెస్‌ నాయకులు అలాంటి డేర్ డెవిల్‌ను భరించగలరా అనే సందేహాలూ తలెత్తున్నాయి. దశాబ్దాల పాటు పార్టీని అంటపెట్టుకున్న తమకు ప్రాధాన్యం ఇవ్వడకుండా నిన్నామొన్నా చేరిన రేవంత్ రెడ్డి వంటి వారికి పట్టం కడుతున్నారని హస్తం పెద్దనేతలు అసంతృప్తితో రగులుతున్న నేపథ్యంలో కాషాయం వదిలేసి వస్తున్న నేతలను ఎలా స్వీకరిస్తారన్నది ఆసక్తికరం.

ఆ ఎమ్మెల్యేకు కీలక పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న మరో కాషాయ సీనియర్ నేత కూడా కూడా హస్తంవైపు మొగ్గు చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తమ పార్టీ రాష్ట్ర నాయకత్వానికి షాక్ ట్రీట్‌మెంట్ ఇవ్వాలంటూ ఓ షాకింగ్ ట్వీట్‌ను వదలి కలకలం రేపిన ఆయన త్వరలోనే నిర్ణయ ప్రకటిస్తారని సమాచారం.


Updated : 4 July 2023 12:54 PM GMT
Tags:    
Next Story
Share it
Top