టీఎస్ఆర్టీసీ విలీనం..గవర్నర్ ఐదు సందేహాలు ఇవే
X
టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని, ఇకపై ఆర్టీసీ ఉద్యోగులంతా ప్రభుత్వ ఉద్యోగులేనని ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు బిల్లును రూపొందించిన ప్రభుత్వం, గవర్నర్ ఆమోదానికి పంపించింది. గవర్నర్ నుంచి ఆమోదం రాగానే ఈ అసెంబ్లీ సమావేశాల్లనే బిల్లు పాస్ చేయాలని సర్కార్ భావిస్తోంది. అయితే గవర్నర్ తమిళిసై మాత్రం ఇంకా ఈ బిల్లుపై సంతకం చేయలేదు. ఆమె ఆమోదం తెలపలేదు. దీంతో ఇవాళ ఆర్టీసీ కార్మికులు నిరసన బాట పట్టారు. రెండు గంటల పాటు విధులను బహిష్కరించారు. ఖైరతాబాద్లోని రాజ్ భవన్కు ర్యాలీ చేపట్టారు.ఈ క్రమంలో ఆర్టీసీ బిల్లును పరిశీలిస్తున్నానని గవర్నర్ తమిళిసై తెలిపారు. ఉద్యోగుల ప్రయోజనాలపై పలు సందేహాలు ఉన్నాయన్నారు. ఈ మేరకు బిల్లులోని ఐదు అంశాలపై వివరణ కావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి గవర్నర్ ఓ లేఖను పంపారు.
ఈ 5 అంశాలపై వివరణ ఇవ్వండి :
1. 1958 నుంచి ఆర్టీసీలో కేంద్ర ప్రభుత్వం అందించిన గ్రాంట్లు, షేర్లు, లోన్లుకు సంబంధించిన వివరాలు ఏవీ బిల్లులో లేవు.
2. రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా షెడ్యూల్ IX ప్రకారం ఆర్టీసీ ప్రస్తుత స్థితిని మార్చడంపైన సరైన వివరాలను బిల్లులో తెలపలేదు.
3. ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా ఆర్టీసీ ఉద్యోగులకు పెన్షన్ ఇచ్చే విషయమై ఎక్కడా ప్రస్తావించలేదు. వీరికి కార్మిక చట్టం వర్తిస్తుందా అని ప్రశ్నించారు. అదే విధంగా వీరికి కలిగే ప్రయోజనాలు ఎలా రక్షించబడతాయని అడిగారు.
4. ప్రమోషన్లు, క్యాడర్ నార్మలైజేషన్లో ఆర్టీసీ ఎంప్లాయిస్కు న్యాయం చేసే విషయంపైనా ఎలాంటి క్లారిటీ లేదన్నారు.
5. విలీనం తర్వాత ఆర్టీసీ ఉద్యోగుల ప్రయోజనాలకు సంబంధించిన హామీలను బిల్లులో పొందుపరచాలని సర్కార్కు సూచించారు.