Home > తెలంగాణ > ప్రయాణికులకు షాక్.. T 24 టికెట్ రేటు మళ్లీ పెంచిన ఆర్టీసీ

ప్రయాణికులకు షాక్.. T 24 టికెట్ రేటు మళ్లీ పెంచిన ఆర్టీసీ

ప్రయాణికులకు షాక్.. T 24 టికెట్ రేటు మళ్లీ పెంచిన ఆర్టీసీ
X

ప్రయాణికుల్ని ఆకట్టుకునే ప్రయత్నాల్లో భాగంగా టీ 24 టికెట్ ధరల్ని తగ్గించిన టీఎస్ఆర్టీసీ నెలలు గడవకముందే ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గింది. గ్రేటర్ పరిధిలోని సిటీ బస్సుల్లో 24 గంటల ప్రయాణించేందుకు వీలు కల్పించే టీ 24 టికెట్ ధరను మళ్లీ పెంచింది. ఈ మేరకు ఆర్టీసీ ఈడీ ఆపరేషన్స్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రూ.90గా ఉన్న ఈ టికెట్ ధరను రూ.100కు పెంచింది. ఇక సీనియర్ సిటిజన్లు, 12 ఏండ్లు పైబడిన బాలికలకు రూ.80 ఉండగా రూ.90 చేసింది. ఈ ధరలు జూన్ 16 నుంచి జులై 31 వరకు అమల్లో ఉంటాయని ప్రకటించింది.

గతంలో టీ-24 టికెట్‌ ధర సాధారణ ప్రయాణికులకు రూ.100 ఉండేది. అయితే ఆక్యుపెన్సీ పెంచుకునే ప్రయత్నాల్లో భాగంగా ఏప్రిల్‌ 26న టికెట్ రేటును రూ.10 తగ్గిస్తున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. దీంతో సాధారణ ప్రయాణీకులకు టీ 24 టికెట్ రూ.90కు, సీనియర్‌ సిటిజన్లకు రూ.80కి అందించింది. ఈ నిర్ణయంతో టీ 24 టికెట్లకు డిమాండ్ భారీగా పెరిగింది. గతంలో రోజుకు 25వేల టికెట్లు మాత్రమే అమ్ముడుకాగా.. రేటు తగ్గించాక ఆ సంఖ్య 40వేలకు చేరిందని ఇటీవలే టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ చెప్పారు. ఇప్పుడు అనూహ్యంగా పాత ధరల్ని పునరుద్ధరించారు. టీ 24 టికెట్ రేటు తగ్గించి నెల గడవకముందే మళ్లీ పెంచడంపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు ఎంజీబీఎస్‌లో ఉన్న హైదరాబాద్‌ జోన్‌ ఈడీ ఆఫీస్‌ను కాచిగూడలోని కమ్యూనిటీ ఎమినిటీస్‌ కేంద్రానికి మార్చాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఇక సిటీ బస్సులకు సంబంధించి జూబ్లీ బస్‌స్టేషన్‌లో ఉన్న గ్రేటర్‌ ఈడీ కార్యాలయాన్ని మిథానిలోని కమ్యూనిటీ ఎమినిటీస్‌ సెంటర్‌కు మార్చనున్నారు. ఎండీ సజ్జనార్‌ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బస్‌భవన్‌ ఈడీ ఆదేశాలు జారీ చేశారు.

Updated : 14 Jun 2023 2:57 AM GMT
Tags:    
Next Story
Share it
Top