TSRTC: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. జేబీఎస్ నుంచి విజయవాడ బస్సులు
X
విజయవాడ వెళ్లే ప్రయాణికులకు గుడ్న్యూస్. జేబీఎస్ నుంచి విజయవాడకు బస్సులు నడిపించాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. బీహెచ్ఈఎల్/మియాపూర్ నుంచి వెళ్లే 24 సర్వీసులను ఇకపై ఎంజీబీఎస్ నుంచి కాకుండా జేబీఎస్ మీదుగా నడపనుంది. ఈ సర్వీసులు కేపీహెచ్బీ కాలనీ, బాలానగర్, బోయిన్పల్లి, జేబీఎస్, సంగీత్ (పుష్పక్ పాయింట్), తార్నాక (పుష్పక్ పాయింట్ ), హబ్సీగూడ (పుష్పక్ పాయింట్ ), ఉప్పల్ (పుష్పక్ పాయింట్ ), ఎల్బీనగర్ మీదుగా విజయవాడకు వెళ్తాయి. రేపటి(అక్టోబర్ 18)నుంచే ఈ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. పైగా జేబీఎస్ మీదుగా వెళ్లే బస్సుల టికెట్ ధరల్లోనూ ఎలాంటి మార్పు ఉండదు. ఎంజీబీఎస్ నుంచి నడిచే సర్వీసుల మాదిరిగానే చార్జీలు ఉంటాయి. ఈ సర్వీసుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం http://tsrtconline.in వెబ్సైట్ సంప్రదించవచ్చు.
ప్రస్తుతం బీహెచ్ఈఎల్, మియాపూర్ నుంచి వచ్చే బస్సులు ఎంజీబీఎస్ మీదుగా విజయవాడకు వెళ్తున్నాయి. దీంతో.. జేబీఎస్, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల ప్రయాణికులు ఎంజీబీఎస్కు రావాల్సి వచ్చేది. దీంతో.. చాలా మంది ఇబ్బంది పడేవారు. ఈ విషయాన్నే ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి తీసుకువచ్చారు ప్రయాణికులు. జేబీఎస్ మీదుగా విజయవాడకు బస్సులను నడపాలని విజ్ఞప్తి చేశారు. వాళ్ల విజ్ఞప్తుల మేరకు మొదటగా 24 సర్వీసులను జేబీఎస్ మీదుగా నడపాలని సంస్థ నిర్ణయించింది.తాజా నిర్ణయంతో బోయినపల్లి, సికింద్రాబాద్, జేబీఎస్, తార్నాక, హబ్సిగూడ, ఉప్పల్(JBS, Tarnaka, Habsiguda, Uppal) ప్రాంతాల ప్రయాణికులకు ఉపయోగకరమని, ఈ సర్వీసులను వినియోగించుకోవాలని ఆర్టీసీ అధికారులు కోరారు.