Home > తెలంగాణ > భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్‌ సంస్థ వార్నింగ్‌

భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్‌ సంస్థ వార్నింగ్‌

భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్‌ సంస్థ వార్నింగ్‌
X

రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు, మూడు రోజుల పాటు ఇవే వర్షాలు కొనసాగుతాయని..వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో విద్యుత్ శాఖ(టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌) అప్రమత్తమైంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని 9 విద్యుత్‌ సర్కిళ్ల పరిధిలో విద్యుత్‌ శాఖ అధికారులు ప్రజలను క్షేత్ర స్థాయిలో అప్రమత్తం చేస్తున్నారు. విద్యుత్‌ వినియోగదారులతో పాటు ప్రజలు విద్యుత్‌ ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు

రోడ్ల వెంబడి ఉన్న కరెంట్ స్తంభాలను తాకే ప్రయత్నం చేయరాదు. తెగి పడిన విద్యుత్‌ తీగలను తాకరాదు. అపార్టుమెంట్‌ సెల్లార్‌లోకి నీరు చేరి విద్యుత్‌ తీగలు తగిలినా, మీటర్ల దాకా వచ్చినా వెంటనే విద్యుత్‌ శాఖ అధికారులకు సమాచారం అందించాలి. నూతనంగా నిర్మిస్తున్న భవనాలను నీటితో తడుపుతున్నప్పుడు దగ్గరలో ఉన్న విద్యుత్‌ వైర్లను,పరికరాలను గమనించాలి.

మహిళలు బట్టలు ఆరవేసేందుకు వాడే తీగలు విద్యుత్‌ తీగలకు తగలకుండా ఉండేలా చూసుకోవాలి.చేతులు తడిగా ఉన్నప్పుడు స్విచ్‌లు, ఇతర విద్యుత్‌ పరికరాలను తాకరాదు. స్విచ్‌ ఆఫ్‌ చేయకుండా ప్లగ్‌లను బయటకు తీయరాదు.పిల్లలకు అందనంత ఎత్తులో ప్లగ్‌లను ఏర్పాటు చేయాలి. ఇంటి వైరింగ్‌కు తప్పనిసరిగా ఎర్తింగ్‌ వేయాలి.

గోడల నుంచి వర్షపు నీరు దిగుతుంటే వెంటనే మరమ్మతులు చేయించాలి. విద్యుత్‌ బోర్డులోకి నీరు దిగితే ప్రమాదాలు జరుగుతాయి. ఆయా విద్యుత్‌ మరమ్మతు పనులు సొంతంగా చేయకూడదు. చిన్న పనైనా, ఎలక్ట్రిషియన్‌ను పిలిపించి చేయించాలి. భవనాలపై నుంచి వెళ్లే డిష్‌, టెలిఫోన్‌, ఇంటర్నెట్‌ సేవల తీగల వల్ల వర్షా కాలంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. భవనాల సమీపం నుంచి వెళ్లే తీగలకు ప్లాస్టిక్‌ తొడుగులు చేయించాలి.

వర్షం పడుతున్న సమయంలో విద్యుత్‌ తీగల కింద, ట్రాన్స్‌ఫార్మర్ల పక్కన నిలబడవద్దు. ఎవరికైనా విద్యుత్‌ షాక్‌ తగిలినట్లయితే వారిని కాపాడడానికి పొరపాటున ఐరన్‌ రాడ్స్‌ను వాడకూడదు. చెక్క లేదా ప్లాస్టిక్‌తో చేసిన వస్తువులను మాత్రమే ఉపయోగించాలి. ముందస్తు అవగాహనతో వర్షా కాలంలో ఎదురయ్యే విద్యుత్‌ ప్రమాదాలతో సురక్షితంగా ఉండవచ్చు.

Updated : 27 July 2023 6:05 AM GMT
Tags:    
Next Story
Share it
Top