Home > తెలంగాణ > Medaram : మేడారంలో బెల్లాన్ని బంగారం అని ఎందుకు పిలుస్తారు..?

Medaram : మేడారంలో బెల్లాన్ని బంగారం అని ఎందుకు పిలుస్తారు..?

Medaram : మేడారంలో బెల్లాన్ని బంగారం అని ఎందుకు పిలుస్తారు..?
X

దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం. సమ్మక-సారలమ్మ జాతరగా ప్రసిద్ధి చెందిన దీనిని తెలంగాణ కుంభమేళా అని కూడా పిలుస్తారు. గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే ఈ వేడుకకు తెలంగాణ నుంచే కాక పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు. రెండేండ్లకు ఒకసారి జరిగే ఈ జాతర మాఘ శుద్ధ పౌర్ణమి రోజున మొదలై నాలుగు రోజుల పాటు సాగుతుంది.

కుంభమేళా తర్వాత అంత భారీగా భక్తులు పాల్గొనే ఈ జాతరను రాష్ట్ర ప్రభుత్వం 1996లో రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ఈ గిరిజన జాతరకు తెలంగాణ, ఏపీతో పాటు చత్తీస్ ఘడ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచి లక్షలాది మంది తరలివస్తారు. దీంతో మేడారం ప్రాంతం నాలుగు రోజుల పాటు జనసంద్రాన్ని తలపిస్తుంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు సమ్మక్క సారలమ్మకు మొక్కులు చెల్లించుకుని తిరుగుపయనం అవుతారు.

సమ్మక్క, సారలమ్మలకు భక్తులు బెల్లాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. దానినే బంగారం అని పిలుస్తారు. మొక్కిన మొక్కులు తీరితే నిలువెత్తు బంగారాన్ని అమ్మలకు సమర్పించుకుంటారు. జాతర సమయంలో సమ్మక్క, సారలమ్మ గద్దెల వద్దకు వెళితే.. బంగారంతో నిండిపోయి కనిపిస్తుంది. కాకతీయుల కాలం నుంచి సమ్మక్క, సారలమ్మలకు బెల్లాన్ని సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే మేడారంలో బెల్లాన్ని బంగారంగా పిలవడం వెనుక ఒక్కొక్కరు ఒక్కో కథ చెబుతుంటారు.

ఆదివాసీలకు బెల్లం, ఉప్పు అంటే చాలా ఇష్టమట. గతంలో వాటిని ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకునేవారు. ఉప్పుకన్నా బెల్లానికి కాస్త ఎక్కువ విలువ. అందుకే దాన్ని ఖరీదైనదిగా భావించేవారట. వారికి అంత విలువైనది కాబట్టే బెల్లాన్ని బంగారంగా భావించి సమ్మక్క, సారలమ్మకు సమర్పిస్తారు. అయితే బెల్లాన్ని బంగారంగా పిలవడం వెనుక ఇంకో కథ కూడా ఉంది. పూర్వం భక్తులు చాలా దూరం నుంచి ప్రయాణించి మేడారం చేరుకునేవారు. అక్కడే ఓ వారం పది రోజులు పాటు ఉండి అమ్మవార్లను దర్శించుకునేవారు. వారంతా ఆకలైనప్పుడు ఇన్‌స్టాంట్‌ ఎనర్జీ కోసం బెల్లం పానకాన్ని తాగేవారట. అందుకే అంత శక్తినిచ్చే బెల్లాన్ని బంగారంగా భావించి అమ్మవారికి కానుకగా సమర్పించేవారని అంటారు.

చాలా మంది భక్తులు తమ కోరికలు నెరవేరితే అమ్మలకు బెల్లాన్ని బంగారంగా సమర్పిస్తారు. సమ్మక్క సారలమ్మను మొక్కుకుంటే సంతానం కలిగినా, మంచికాలేజీలో సీటు వచ్చినా, ఉద్యోగం వచ్చినా, విదేశాల్లో ఉన్నత చదువులకు అవకాశం వచ్చినా ఆ పిల్లల బరువుకు సమానంగా బెల్లాన్ని ఇస్తారు.

Updated : 7 Feb 2024 1:08 PM GMT
Tags:    
Next Story
Share it
Top