Home > తెలంగాణ > ఏ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదు - షర్మిల

ఏ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదు - షర్మిల

ఏ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదు - షర్మిల
X

వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ అధికారం చేపట్టిన తొమ్మిదేళ్లలో రాష్ట్రాన్ని లిక్కర్ రాష్ట్రంగా మార్చారని ఆమె మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ. 70 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని షర్మిల ఆరోపించారు. హైదరాబాద్ గన్ పార్కు వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజల ప్రతి ఒక్కరి తలపై లక్షన్నర రూపాయల అప్పుల భారం మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్ని వర్గాలకు మోసం

సీఎం కేసీఆర్‌కు 10 ప్రశ్నలు సంధించిన షర్మిల దానికి సంబంధించిన పోస్టర్‌ విడుదల చేశారు. భారీగా అవినీతి సొమ్ము దాచుకున్న కేసీఆర్ ప్రజలకిచ్చిన హామీలన్నింటినీ తుంగలో తొక్కారని అన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. పేదలకు ఇండ్లు, గిరిజనులకు పట్టాలు, యువతకు ఉద్యోగాలు, రైతులకు రుణమాఫీ చేస్తామని మాట తప్పారని విమర్శించారు. ఇదేంటని ప్రశ్నిస్తే అరెస్టులు, నిర్బంధాలతో భయపెడుతున్నారని షర్మిల వాపోయారు. అమరవీరులు, ఉద్యమకారులకు కనీస గౌరవం, గుర్తింపు లేదన్న ఆమె.. ప్రజలు పోరాడి తెచ్చుుకన్న తెలంగాణను కేసీఆర్ సర్వనాశనం చేశారని అన్నారు.

విలీనం ప్రసక్తే లేదు

వైఎస్సాఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారంటూ వస్తున్న వార్తలపై వైఎస్ షర్మిల స్పందించారు. తమ పార్టీని మరో పార్టీలో విలీనం చేసే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. తన కష్టాన్ని అవమానించవద్దన్న ఆమె.. ఎన్నికల్లో పోటీకి అభ్యర్థుల్ని సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్తో ఎప్పటికీ పొత్తు పెట్టుకునే ప్రసక్తేలేదని షర్మిల స్పష్టం చేశారు. పొత్తుల విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ కూడా స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్తో పొత్తు ఉండబోదని కాంగ్రెస్‌ స్పష్టం చేయాలని షర్మిల సవాల్ విసిరారు.


Updated : 1 Jun 2023 10:23 AM GMT
Tags:    
Next Story
Share it
Top