Home > కెరీర్ > పది, ఇంటర్ పరీక్షలు ఇక ఏడాదికి రెండుసార్లు!

పది, ఇంటర్ పరీక్షలు ఇక ఏడాదికి రెండుసార్లు!

పది, ఇంటర్ పరీక్షలు ఇక ఏడాదికి రెండుసార్లు!
X

పదో తరగతి, ఇంటర్‌ బోర్డు పరీక్షలకు విద్యార్థులు రెండుసార్లు హాజరయ్యేందుకు అవకాశం ఇవ్వనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ప్రకటించారు. 2025-26 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్‌లో పీఎం శ్రీ (ప్రైమ్ మినిస్టర్ స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా) పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2025-26 అకడమిక్‌ సెషన్‌ నుంచి పది, 12వ తరగతి బోర్డు పరీక్షలను విద్యార్థులు ఏడాదిలో రెండు సార్లు రాసే వీలు కల్పించనున్నామ‌ని ప్ర‌క‌టించారు. ఇందులో ఉత్తమ స్కోరును ఎంచుకునే అవకాశం ఉంటుంద‌న్నారు. విద్యార్థులను ఒత్తిడికి దూరం చేసి నాణ్యమైన విద్యను అందించడమే త‌మ‌ సర్కారు లక్ష్యమ‌న్నారు. ఈ ఫార్ములా దేశాన్ని 2047 నాటికి వికసిత భారతంగా తీర్చిదిద్దుతుంద‌నే ఆశాభావాన్ని ఆయ‌న వ్య‌క్తం చేశారు.. పాఠశాల విద్యకు సంబంధించి కేంద్ర విద్యాశాఖ గతేడాది ఆగస్టులో కొత్త కరికులమ్‌ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించిన విషయం తెలిసిందే. దాని ప్రకారం.. టెన్త్‌, ఇంటర్‌ బోర్డు పరీక్షలను ఏడాదిలో రెండుసార్లు నిర్వహించాలని ప్రతిపాదించారు. ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు నిర్వహించడం ద్వారా విద్యార్థులు ప్రిపేర్‌ అయ్యేందుకు తగినంత సమయం దొరకడంతో పాటు మంచి పనితీరు కనబరిచేందుకు వీలుంటుందని విద్యాశాఖ పేర్కొంది. అయితే, పరీక్షలు సెమిస్టర్‌ పద్ధతిలో పెడతారా, లేక మొత్తం సిలబస్‌పై రెండుసార్లు నిర్వహిస్తారా? అనే విషయంపై స్పష్టత లేదు.

ఇక, కొత్త ఫ్రేమ్‌వర్క్‌ ప్రకారం.. 11, 12 తరగతుల విద్యార్థులు రెండు లాంగ్వేజ్‌లను కచ్చితంగా అభ్యసించాలని, వాటిలో ఒకటి భారతీయ భాష అయి ఉండాలని మాత్రం నిర్ణయించారు. ఇదిలా ఉండగా.. దేశవ్యాప్తంగా విద్యార్థులు తమ మాతృభాషలో చదుకునేందుకు అవకాశం కల్పించాలని నిర్ణయించిన కేంద్రం రాబోయే మూడేళ్లలో అన్ని తరగతుల పాఠ్య పుస్తకాలను ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. ఈ మేరకు ట్రాన్స్‌లేషన్‌ చేయాలని ఎన్‌సీఈఆర్‌టీ, యూజీసీ, ఏఐసీటీఈ, ఇగ్నో, జాతీయ సార్వత్రిక విద్యా పీఠం (NIOS‌)తోపాటు కేంద్రీయ విద్యాసంస్థలైన ఐఐటీలు, ఎన్‌ఐటీలు, సెంట్రల్ వర్సిటీలను విద్యాశాఖ ఆదేశించింది.


Updated : 20 Feb 2024 11:18 AM GMT
Tags:    
Next Story
Share it
Top