Home > తెలంగాణ > Balka Suman : దమ్ముంటే రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలి..

Balka Suman : దమ్ముంటే రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలి..

Balka Suman : దమ్ముంటే రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలి..
X

దమ్ముంటే రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించుకొని ఎన్నికలకు పోవాలని సీఎం రేవంత్ కు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ సవాల్ విసిరారు. రాహుల్ ను పీఎం అభ్యర్థిగా ప్రకటించి మొత్తం ఎంపీ స్థానాల్లో 272 స్థానాలు గెలుచుకుంటే తాము దేనికైనా రెడీ అని అన్నారు. బుధవారం తెలంగాణ భవన్ లో ఆయన మాట్లాడుతూ.. రాహుల్ గాంధీని ప్రధానిగా అభ్యర్థిగా ప్రకటిస్తే ప్రతిపక్ష హోదా కూడా రాదని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ తరఫున పీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే కనీసం 55 ఎంపీ స్థానాలను కూడా కాంగ్రెస్ గెలుచుకోలేదని అన్నారు. నాడు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మేయర్ స్థానాన్ని సాధిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని రేవంత్ అన్నారని తెలిపారు. కానీ ఆయన తన మాట నిలబెట్టుకోలేదని అన్నారు. తెలంగాణ తెచ్చిన పార్టీ, రెండు సార్లు అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన పార్టీకా రేవంత్ సవాల్ విసిరేది అని మండిపడ్డారు.

కేసీఆర్ రాష్ట్రాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దితే.. రేవంత్ రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తున్నారని అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా నిత్యం పక్క పార్టీలను తిట్టడం పనిగా రేవంత్ పని చేస్తున్నారని అన్నారు. ఆయన పని తీరు చూస్తే వాళ్లు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నామనే అనుకుంటున్నారని సెటైర్లు వేశారు. పాలకపక్షం అనే స్పృహ లేకుండా కేటీఆర్, హరీశ్ రావులను తిట్టడమే పనిగా వారి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని అన్నారు. ఒకవేళ వాళ్ల వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తే తాము వచ్చి మూడు నెలలు కూడా కాలేదు.. తమల్ని బద్నాం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వాన్ని పడగొడతామని తాము ఏనాడు అనలేదని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి ఐదేళ్లు ఉండాలనే తాము కోరుకుంటున్నామని, ఎందుకంటే హామీలను నెరవేర్చలేక బొక్కబొర్లా పడతారని అన్నారు. అది చూశాక గానీ రాష్ట్ర ప్రజలకు రేవంత్ నిజస్వరూపం అర్థం కాదని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు పళ్లెంలో పెట్టి ఇస్తే సర్వ నాశనం చేస్తున్నారని అన్నారు. రైతు బంధు నిథులు 7700 కోట్లు తాము ఖజానాలో పెట్టిపోతే రైతులకు ఎందుక ఇవ్వలేదని అడిగారు. కాంగ్రెస్ పాలన గురించి తెలంగాణ ప్రజలకు అర్థమైందని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు.

ఎన్నికల సమయంలో ప్రతి ఇంటికి గ్యాస్, కరెంట్ ఫ్రీగా ఇస్తామని చెప్పి.. గెలిచాక కొర్రీలు పెడుతున్నారని మండిపడ్డారు. పథకాల అమలుకు రకరకాల ఆంక్షలు పెట్టి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని అన్నారు.

కోటి 24 లక్షలు గ్యాస్ కనెక్షన్ లు, 90 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉండగా..కేవలం 40 లక్షల మందికే ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇస్తామనడం కరెక్ట్ కాదని అన్నారు. ఇది తమ నమ్మి ఓట్లేసిన ప్రజల నెత్తి మీద శఠగోపం పెట్టడం తప్ప మరొకటి కాదని అన్నారు. 90 లక్షల తెల్ల రేషన్ కార్డు ఉన్నవాళ్లందరికీ రూ.500కే ఉచిత గ్యాస్ పథకం వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలు తిగరబడతారని హెచ్చరించారు.

కోటి 34 లక్షల 48 వేల గృహ విద్యుత్ కనెక్షన్లు ఉండగా కోటి 5 లక్షల మందికే గృహజ్యోతి పథకం అమలు చేస్తామనడం సరికాదని అన్నారు. మిగతా 29 లక్షల 34 వేల మందికి కూడా 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ అందించాలని డిమాండ్ చేశారు. లేకుంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు గుణపాఠం తప్పదని హెచ్చరించారు.

Updated : 28 Feb 2024 9:51 AM GMT
Tags:    
Next Story
Share it
Top