Home > తెలంగాణ > నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్

నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్

నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్
X

సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరం సందర్భంగా సీఎం రేవంత్ రాష్ట్ర ప్రజలకు సందేశమిచ్చారు. ప్రజల సహకారంతోనే రాష్ట్రంలో ప్రజా పాలన ఏర్పాటు చేసుకున్నామని అన్నారు. నిర్బంధాలు, ఇనుప కంచెలను తొలగించి ప్రజా పాలనలో ప్రజలను భాగస్వాములను చేశామన్న సీఎం.. ప్రజాస్వామ్య పునరుద్ధరణ, పౌరులకు స్వేచ్ఛ ఉంటుందన్న తమ హామీని నిలబెట్టుకున్నామని అన్నారు. ఆరింటిలో రెండు గ్యారెంటీలు అమలు చేశామని, కొత్త ఏడాదిలో మిగతా గ్యారెంటీల అమలుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమం అందాలని, అభివృద్ధిలో రాష్ట్రం అగ్రభాగాన ఉండాలన్నదే తమ ఆకాంక్ష అని అన్నారు. యువత భవిత తమ ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని, వారి భవిష్యత్ కు గ్యారెంటీ ఇచ్చే దిశగా ఆలోచన చేస్తున్నామని అన్నారు. ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు సమూల ప్రక్షాళనకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం తెలిపారు.

రైతుల విషయంలో ఇచ్చిన ప్రతి మాటకు కట్టుబడి ఉన్నామన్న సీఎం.. ఈ నూతన సంవత్సరం ‘రైతు-మహిళ-యువత నామ సంవత్సరం’గా సంకల్పం తీసుకున్నామని తెలిపారు. ప్రజా పాలనకు అనుగుణంగా వ్యవస్థల పునర్ వ్యవస్థీకరణ జరుగుతోందని, చిన్నాభిన్నమైన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిపుష్టం చేసే దిశగా అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు. ఆర్థిక, విద్యుత్ రంగాలలో వాస్తవ పరిస్థితులను శ్వేతపత్రాల ద్వారా ప్రజల ముందు ఉంచామన్న ఆయన.. త్వరలో సాగునీటి రంగంలో జరిగిన అవినీతి పై కూడా శ్వేతపత్రంతో వాస్తవాలు వెల్లడిస్తామని తెలిపారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకుంటామని, దోపిడీకి గురైన తెలంగాణ ప్రజల సంపదను తిరిగి రాబట్టేందుకు చర్యలు మొదలు పెట్టామని పేర్కొన్నారు. అధికారం కోల్పోయిన దుగ్ధ, ఈర్ష్యతో కొందరు అధములు చేసే తప్పుడు ప్రచారాలు, అసత్య ప్రకటనలతో గందరగోళపడవద్దని రాష్ట్ర ప్రజలకు సూచించారు. ఇది గత పాలన కాదు.. జన పాలన అని సీఎం అన్నారు.

ప్రతి పౌరుడు తమ ప్రభుత్వాన్ని చేరుకునేందుకు 24 గంటలు ద్వారాలు తెరిచే ఉంటాయని రేవంత్ అన్నారు. అమరులు, ఉద్యమకారుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్న సీఎం రేవంత్.. తెలంగాణ ఉద్యమకారులపై నమోదైన కేసుల వివరాలు సేకరించాక ఆ కేసుల నుండి విముక్తి కల్పించే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తెలిపారు. ఆటో కార్మికులు, అసంఘటిత కార్మికుల సంక్షేమం కోసం రూ.5 లక్షల బీమా సౌకర్యాన్ని తీసుకొచ్చామని, అలాగే జర్నలిస్టుల సంక్షేమం పట్ల తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని అన్నారు. తెలంగాణ కోటి రతనాల వీణగా.. కోట్లాది ప్రజల సంక్షేమ వాణిగా అభివృద్ధిలో శిఖరాగ్రాన నిలవాలని ఆకాంక్షిస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు. ఈ నూతన సంవత్సరంలో ప్రతి పౌరుడి ఆకాంక్షలు నెరవేరాలని, తెలంగాణలోని ప్రతి గడపన సౌభాగ్యం వెల్లివిరియాలని, ప్రతి ఇంటా వెలుగులు నిండాలని మనసారా ఆకాంక్షిస్తున్నాని సీఎం రేవంత్ తెలిపారు.

Updated : 31 Dec 2023 4:25 PM GMT
Tags:    
Next Story
Share it
Top