Home > తెలంగాణ > Bontu Rammohan : సీఎం రేవంత్ ను కలిసిన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్

Bontu Rammohan : సీఎం రేవంత్ ను కలిసిన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్

Bontu Rammohan : సీఎం రేవంత్ ను కలిసిన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ నేతలు వరుసపెట్టి టీపీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డిని కలవడం రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతోంది. తాజాగా బీఆర్ఎస్ సీనియర్ నేత, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. కొంతకాలంగా బొంతు రామ్మోహన్ పార్టీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్ టికెట్‌ను ఆశించిన ఆయనకు నిరాశే ఎదురైంది. చివరి వరకు ప్రయత్నించినప్పటికీ బీఆర్ఎస్ పెద్దలు బండారు లక్ష్మారెడ్డికి టికెట్ కేటాయించారు. దీంతో రామ్మోహన్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఆ తర్వాతి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. కనీసం లోక్‌సభ టికెట్ అయినా దక్కుతుందేమోనని ఆశించిన ఆయనకు.. ఆ అవకాశాలు కూడా కనిపించకపోవడంతో పార్టీ మారుతారనే ప్రచారం చాలా రోజుల నుంచి జరుగుతోంది. ఈ నేపథ్యంలో బొంతు రామ్మోహన్ ఇప్పుడు ఏకంగా సీఎం రేవంత్ రెడ్డిని కలవడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన త్వరలోనే కాంగ్రెస్ లో చేరుతున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఇది కేవలం మర్యాదపూర్వక భేటీయా లేక మరేదైనా కారణం ఉందా అనేది తెలియాల్సి ఉంది.

కాగా ఇప్పటికే ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు నేతలు, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్‌లు సీఎంతో భేటీ అయ్యారు. తమ సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకే ఆయనను కలిశామని వారు చెబుతున్నప్పటికీ.. రాజకీయ కారణాలు ఉన్నాయని మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు వచ్చే పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని కాంగ్రెస్ నేతలు చెబుతుండటం అనేక అనుమానాలకు తావిస్తోంది.




Updated : 11 Feb 2024 1:09 PM GMT
Tags:    
Next Story
Share it
Top