Home > తెలంగాణ > MLC Kavitha : సోనియా, ఖర్గేలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ

MLC Kavitha : సోనియా, ఖర్గేలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ

MLC Kavitha : సోనియా, ఖర్గేలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ
X

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన జీవో నెం.3ని వెంటనే రద్దు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం మహిళలకు ఉద్యోగాల్లో 33.3శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తెచ్చిన జీవో నెం.41, 56లను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రద్దుచేయడాన్ని ఆమె తప్పుబట్టారు. దీనిపై కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీకి, మల్లికార్జున ఖర్గేకు కవిత లేఖ రాశారు. జీవో నెం.41, 56లను కాంగ్రెస్ రద్దుచేసి జీవో నెం.3ని తెచ్చిందని.. దీనివల్ల మహిళలు ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోల్పోతారని తెలిపారు. ఈ జీవోను వెనక్కితీసుకునేలా సీఎంకు ఆదేశాలివ్వాలని కోరారు. ఆడబిడ్డల హక్కులను కాంగ్రెస్‌ పార్టీ తుంగలో తొక్కుతోందని విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యంగా చెబుతూ ఏర్పడిన కొత్త ప్రభుత్వంలో ఆడబిడ్డలకు తీరని అన్యాయం జరుగుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.

సోనియా, ఖర్గేలకు రాసిన లేఖలో కవిత ఏమన్నారంటే?

"గత ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీలను తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు నమ్మి మీ పార్టీకి పెద్ద ఎత్తున ఓట్లు వేసి ప్రభుత్వంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. ఆ నాడు తెలంగాణ విద్యార్థినుల చావులతో సహా అనేక అంశాలను అనవసరంగా రాజకీయం చేసి.. విద్యార్థుల్లో భయాందోళనను కల్పించి ఓట్లు కూడగట్టుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ఓ ప్రత్యేక శైలిని అవలంభించింది. అధికారంలోకి రాగానే ఎన్నో ఉద్యమాలు, పోరాటాల ఫలితంగా వచ్చిన ఆడబిడ్డల హక్కులను తుంగలో తొక్కుతోంది.

1996లో అనేక పోరాటాల ఫలితంగా మహిళలకు ఉపాధి అవకాశాల్లో 33.3 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో నంబర్‌ 41, 56 జారీ అయ్యాయి. దీనికి 1992లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఇందిరా సాహ్ని తీర్పు కూడా ఎంతో తోడ్పాటునిచ్చింది. ఆ తర్వాత రాజ్యంగబద్ధంగా మహిళలకు రోస్టర్ పాయింట్లతో కూడిన హారిజాంటల్ రిజర్వేషన్లు కల్పించారు. మన దేశంలో సామాజిక రిజర్వేషన్లు ఎలా అయితే ఉన్నాయో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కచ్చితంగా అమలు చేసే పద్ధతి నడుస్తోంది.

మహిళలకు అవకాశాలు లేక, విద్యా ప్రమాణాలు అందుకోలేక కొన్నేండ్లపాటు కోల్పోయినప్పటికీ క్యారీ ఫార్వర్డ్ అవుతూ వస్తోంది. ఇన్నేళ్ల నుంచి సాగుతున్న ఈ పద్ధతిని ఇటీవల రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పరిగణలోకి తీసుకొని తెలంగాణలో మీ గ్యారెంటీతో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల హక్కులను కాలరాస్తూ జీవో 41, 56ను రద్దు చేస్తూ ఈ నెల 10న కొత్తగా జీవో 3ను తీసుకువచ్చింది.

రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీచేసినా.. తాము మహిళల హక్కులను హరించబోమని 2023 జనవరిలో కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎవరితో సంప్రదింపులు జరపకుండా మహిళల హక్కులకు భంగం కలిగిస్తూ ఈ నెల 6న రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. తద్వారా మహిళల హక్కులను సంపూర్ణంగా, శాశ్వతంగా హరిస్తూ రోస్టర్ పాయింట్లు లేకుండా హారిజాంటల్ పద్ధతిలో రిజర్వేషన్లను కల్పిండానికి జీవో 3ను ప్రభుత్వం జారీ చేసింది. ఇది మహిళల ఉద్యోగావకాశాలకు శరాఘాతంగా నిలవనుంది.

ఉదాహరణకు ఈ ఏడాది దాదాపు 2 లక్షల 50 వేల మంది ఇప్పటికే టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో నమోదుచేసుకున్నారు. వారిలో లక్ష మంది ఆడబిడ్డలు ఉన్నారు. ఈ ఏడాది 2 లక్షల కొలువులు ఇస్తామని ప్రభుత్వం చెబుతున్నది. అంటే 33.3 శాతం రిజర్వేషన్ల మేరకు కనీసం 66 వేల మంది ఆడబిడ్డలకు ఉద్యోగాలు కచ్చితంగా రావాలి. అదనంగా మరింత మంది మహిళలకు ఉద్యోగాలు లభించాలి. అదే ఈ రిజర్వేషన్ల స్ఫూర్తి. దీనిని పక్కనబెడుతూ సీఎం రేవంత్ రెడ్డి కొత్త జీవో తీసుకురావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వ నిర్ణయం వల్ల ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు తీరని అన్యాయం జరుగుతుంది. ఒక ఆడబిడ్డగా, ఆడబిడ్డల హక్కుల కోసం మాట్లాడే వ్యక్తిగా తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నాను.

ఈ అంశంపై జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ వైఖరి ఏమిటో చెప్పాలి. సుప్రీంకోర్టు తీర్పును పాటించబోమంటూ బీహార్, కర్ణాటక రాష్ట్రాలు జీవోలు జారీ చేశాయి. కానీ తెలంగాణలో మాత్రం మీ గ్యారెంటీతో ఇందిరమ్మ రాజ్యంగా చెబుతూ ఏర్పడిన కొత్త ప్రభుత్వంలో ఇంటి ఆడబిడ్డలకు తీరని అన్యాయం జరుగుతోంది. ఈ విషయంలో జోక్యం చేసుకొని ఆ జీవోను తక్షణమే వెనక్కి తీసుకునేలా ముఖ్యమంత్రికి ఆదేశాలు జారీ చేయాలి’ అని కవిత తన లేఖలో విజ్ఞప్తి చేశారు.

Updated : 19 Feb 2024 9:38 AM GMT
Tags:    
Next Story
Share it
Top