Home > తెలంగాణ > బీఆర్ఎస్ పథకాలను రద్దు చేసేందుకు కుట్ర.. హరీశ్ రావు, కేటీఆర్

బీఆర్ఎస్ పథకాలను రద్దు చేసేందుకు కుట్ర.. హరీశ్ రావు, కేటీఆర్

బీఆర్ఎస్ పథకాలను రద్దు చేసేందుకు కుట్ర.. హరీశ్ రావు, కేటీఆర్
X

ప్రజలకు లబ్ధి కలిగిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను రద్దు చేసేందుకు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని మాజీ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ ఆరోపించారు. పార్టీ శాసనసభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జిలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కేడర్ కు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా హరీశ్ రావు, కేటీఆర్ మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ప్రారంభించిన అనేక పథకాలను కేవలం రాజకీయ అక్కసుతో రద్దు చేసుకుంటూ వెళుతోందని అన్నారు. గత పది సంవత్సరాలలో లక్షలాదిమందికి ఉపయోగపడి, వారి జీవితాల్లో మార్పు తెచ్చిన కార్యక్రమాలను సైతం కేవలం రాజకీయ దురుద్దేశంతో పక్కన పెడుతోందని అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు గత ప్రభుత్వం అనుమతులు, నిధులు ఇచ్చిన రోడ్లు, భవనాల వంటి ప్రజా ప్రయోజన మౌలిక వసతులను సైతం రద్దు చేస్తోందని అన్నారు.

ఇప్పటికే గృహలక్ష్మి కార్యక్రమాన్ని రద్దు చేస్తూ జీవో ఇచ్చిందని, అయితే గృహలక్ష్మి కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారుల ఎంపిక పూర్తై అధికారిక పత్రాలు అందుకున్న వారి పరిస్థితి ఏంటో ప్రభుత్వం తెలియజేయాలని డిమాండ్ చేశారు.

ఇప్పటికే లబ్ధిదారులు ప్రభుత్వం అందించిన అధికారిక పత్రాలు ఆధారంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ప్రజల ప్రయోజనాలకు లబ్ధి కలిగించే ఏ కార్యక్రమాన్ని వ్యతిరేకించినా, రద్దు చేసినా బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున నిలబడుతుందని అన్నారు. దీంతోపాటు గొర్రెల పంపిణీ ద్వారా లక్షలాదిమంది యాదవుల కుటుంబాల్లో ఆర్థిక భరోసా కలిగిందని, ఇలాంటి కార్యక్రమాన్ని కూడా రద్దు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తోందని అన్నారు. బలహీన వర్గాల్లో కీలకమైన యాదవ సామాజిక వర్గానికి ఆర్థిక భరోసా కలిగించే ఈ కార్యక్రమాన్ని రద్దు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ పథకంలో భాగంగా తమ వాటాగా చెల్లించాల్సిన డీడీలు కట్టిన వారికి వెంటనే ప్రభుత్వం గొర్రెలను పంపిణీ చేయాలని అన్నారు. దళిత బంధు కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం రద్దు చేయాలని ఆలోచిస్తోందని, ఎన్నికల్లో దళిత బంధు కార్యక్రమాన్ని మరింతగా విస్తరించి 12 లక్షలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాలని అన్నారు. దళిత బందుకు ఎంపికైన వారికి వెంటనే నిధులు చెల్లించి వారి యూనిట్లు ప్రారంభం అయ్యేలా చూడాలని డిమాండ్ చేశారు. సంక్షేమ కార్యక్రమాల అమలుపైన కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో లబ్ధిదారులకు అండగా నిలబడేలా నిరసన కార్యక్రమాలను చేపడుతామని అన్నారు. లబ్ధిదారుల కోసం పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్చార్జీలు ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సూచన చేశారు.

Updated : 5 Jan 2024 2:54 PM GMT
Tags:    
Next Story
Share it
Top