Home > తెలంగాణ > ఆ సమస్యలను వెంటనే పరిష్కరించండి.. సీఎంకు బండి సంజయ్ లేఖ

ఆ సమస్యలను వెంటనే పరిష్కరించండి.. సీఎంకు బండి సంజయ్ లేఖ

ఆ సమస్యలను వెంటనే పరిష్కరించండి.. సీఎంకు బండి సంజయ్ లేఖ
X

దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న మిడ్ మానేరు బాధితుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బీజేపీ ఎంపీ బండి సంజయ్ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఈ సందర్భంగా పలు విషయాలను ఆయన తన లేఖలో ప్రస్తావించారు. త్యాగాల పునాదులపై ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వ నిర్వాకం వల్ల దశాబ్ద కాలంగా ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వాటిని అధిగమిస్తూ ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా పాలన కొనసాగాలని, ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయాలని సీఎం రేవంత్ ను కోరారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నో ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న మిడ్ మానేరు ముంపు బాధితుల సమస్యలను ఎంపీ బండి సంజయ్ తన లేఖలో వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో 17 ఏండ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రాజెక్టు మిడ్ మానేరని, లక్షలాది ఎకరాలకు సాగు నీటితోపాటు తాగునీటి అవసరాలను తీరుస్తుందనే భావనతో ప్రాజెక్టు ముంపు పరిధిలోని 12 గ్రామాల ప్రజలు ఇండ్లు, భూములు త్యాగం చేశారని అన్నారు.

ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం 12 వేల 500 మంది బాధితులున్నారని, వీరికి సహాయ పునరావాస ప్యాకేజీ కింద 2005-06లో నాటి ప్రభుత్వం చేపట్టిన జీవో నెం.69 ప్రకారం ఐఏవై కింద ఇండ్లు మంజూరు చేసిందని, ముంపు పరిహారం చెల్లిస్తామని నాటి ప్రభుత్వం పేర్కొన్నదని అన్నారు. కానీ వీటి అమలులో తీవ్రమైన జాప్యం జరిగిందని అన్నారు. 2018 జూన్ 16న నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాంతానికి వచ్చి మిడ్ మానేరు బాధితులకు ఐఏవై ఇండ్లకు బదులుగా డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మిస్తామని, అందులో భాగంగా ఒక్కో బాధిత కుటుంబానికి రూ.5 లక్షల 4 వేలు చెల్లిస్తానని హమీ ఇచ్చారని అన్నారు. మిడ్ మానేరు బాధితులను ఆదుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని బండి సంజయ్ కోరారు.

మిడ్ మానేరుకు సంబంధించి 12 గ్రామాల రైతులంతా సాగు భూమిని కోల్పోయిన నేపథ్యంలో నీలోజిపల్లి నుండి నందిగామ, ఆగ్రహారం వరకు ఇండస్ట్రీయల్ కారిడార్ ను, స్కిల్ డెవలెప్ మెంట్ కాలేజీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని, తద్వారా వారిలో నైపుణ్యత పెంచి స్వయం ఉపాధి కల్పిస్తామని ప్రకటించారని తెలిపారు. అట్లాగే 2009 కొత్త డెజిట్ ప్రకారం తేది 01-01-2016 నాటికి 18 ఏండ్లు నిండిన యువతీ యువకులకు ముంపు పరిహారం, పట్టా ఇస్తామన్నారని కానీ వేటికి ఒక్క అడుగు ముందుకు పడలేదని అన్నారు. అదే విధంగా అర్హత లేకున్నా ప్రభుత్వం నుండి లబ్ది పొందిన రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావుతోపాటు మాజీ సీఎం బంధువులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, వెంటనే సంబంధిత మంత్రి, స్థానిక శాసనసభ్యుడు, ప్రజా ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి ముంపు బాధితుల సమస్యల పరిష్కారానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సీఎంను బండి సంజయ్ కోరారు.

Updated : 18 Dec 2023 12:00 PM GMT
Tags:    
Next Story
Share it
Top