‘మేం మోదీకి వ్యతిరేకం కాదు’.. శంకరాచార్యుల పీఠాధిపతుల ప్రకటన

By :  Bharath
Update: 2024-01-11 09:57 GMT

అయోధ్య రామయ్య ఆలయ ప్రారంభోత్సవ వేడుక కోసం యావత్ దేశం ఎదురుచూస్తుంది. జనవరి 22న రామమందిరంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ట ఉంటుందని ఇప్పటికే అయోధ్య రామాలయ ట్రస్ట్ ప్రకటించింది. ఈ వేడుకకు హాజరు కావాలని దేశంలోని ప్రముఖులందరికీ ఆహ్వానాలు కూడా అందాయి. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనడంలేదని పూరీ గోవర్ధన్ మఠం పీఠాధిపతి నిశ్చలానంద సరస్వతి ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఉత్తరాఖండ్‌లోని జ్యోతర్మఠ్ పీఠాధిపతి అవిముక్తేశ్వరానంద సరస్వతి కూడా అయోధ్య రామ మందిరంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి తనతో పాటు జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు దేశంలో నెలకొల్పిన నాలుగు ప్రముఖ పీఠాల అధిపతులు, మత పెద్దలెవరూ హాజరు కారని స్పష్టం చేశారు. ఈ వేడుకను శాస్త్ర పద్దతుల్లో నిర్వహించడం లేదని.. అందుకే దూరంగా ఉంటున్నట్లు తెలిపారు.

ఈ వేడుకను శాస్త్ర విరుద్ధంగా, పవిత్రమైన హిందూ గ్రంధాలను ఉల్లంఘించి నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఆలయ నిర్మాణం పూర్తి కాకుండానే ప్రాణప్రతిష్ట చేస్తున్నారని అవిముక్తేశ్వరానంద సరస్వతి అన్నారు. కాగా ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. తాము మోదీకి వ్యతిరేకం కాదని, శాస్త్ర వ్యతిరేకులం కాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.


Tags:    

Similar News